కేసులు మాఫీ కోసం ఎంపీ విజయసాయిరెడ్డి, భూకబ్జాలు, సెటిల్మెంట్లు, దందాల కోసం మంత్రి అవంతి శ్రీనివాస్లు కాళ్లబేరంలో పోటీపడుతున్నారని మంతెన సత్యన్నారాయణ రాజు పేర్కొన్నారు. ఒలంపిక్స్లో పాదపూజ పెడితే విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్లకే మొదటి బహుమతి వస్తుంది. రాష్ట్రానికి ద్రోహం చేసిన కేసీఆర్ని కలవాల్సిన అవసరం ఏంటి? ఆంధ్రరాష్ట్రంపై నిలువెల్లా.. విషం నింపుకున్న కేసీఆర్ కాళ్ల మీద పడి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, మనోభావాల్ని విజయసాయిరెడ్డి దెబ్బతీసారని అన్నారు.
తన సమకాలీకుడైన కేసీఆర్కి విజయసాయిరెడ్డి కాళ్లు మొక్కాల్సిన అవసరం ఏంటి? కేసీఆర్ను జగన్ ఎందుకు కలుస్తున్నారు. నిన్న జరిగిన 6 గంటల రహస్య సమావేశాల్లో ఏమి తేల్చారు? ఇంకా ఏ కుట్రలు చేయడానికి ఈ అంతరంగిక సమావేశాలు? రాజధానిని మూడు ముక్కలు కాకుండా, నాలుగైదు ముక్కలు చేస్తే ఎలాఉంటుందో చర్చించారా, లేక హైదరాబాద్ లోని జగన్వి, కేసీఆర్ వి, వారి బినామీలకు సంబంధించిన వ్యాపారాల అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ను ఇంకా ఎన్నిరకాలుగా నాశనం చేయాలో కొత్త వ్యూహాలేమన్నా రచించారా? వైసీపీని గెలిపించి కుంపటి నెత్తిమీద పెట్టుకున్నామని అన్ని ప్రాంతాల ప్రజలు అల్లాడుతున్నారు.
కుంపటి దించుకునేది ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం కాళ్ల బేరంలో పోటీపడుతున్నారు. స్వతంత్య్రం వచ్చాక ఎప్పుడన్నా, ఎక్కడన్నా ఇలా జరిగిందా? తుగ్లక్ 2.0కి విజయసాయిరెడ్డి, అవంతి సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. అందుకే రాష్ట్రం పరిస్థితి ఇలా తయారైంది. పందెంబరిలో నుంచి పందెం కోడి పారిపోయినట్లు..పాలన గాలికొదిలి అవంతి శ్రీనివాస్ సొంత వ్యాపారాల్లో మునిగితేలుతున్నారు.
ప్రతి సంక్రాంతికి హరిదాసులు వచ్చి పాటలు పాడిినట్లు...అవంతి శ్రీనివాస్ ఈ సంక్రాంతి కి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. విజయ్మాల్యాని నమ్మి అప్పులిచ్చిన బ్యాంకులు ఎలా మోసపోయాయో. నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తాడని అవంతి ని నమ్మి ఓట్లేసిన బీమిలి ప్రజలు అంతే మోసపోయారు. అవంతి తనకు కేటాయించిన క్రీడాశాఖనే కాకుండా..తన నియోజకవర్గాన్ని కూడా గాలికొదిలి సొంత ప్రయోజనాల కోసం పాలకులాడటం సిగ్గుచేటు. వైసీపీ నేతలు కాళ్లబేరాలు, పాదపూజలు చేయటం, అబద్దాలు, అవాస్తవాలు చెప్పడం మానుకుని పాలనపై దృష్టి పెట్టాలి.