సంక్రాంతి పండగ వచ్చింది అంటే పెద్ద పండగ వచ్చినట్టే. ఈ పండగ రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా పల్లెబాట పడతారు. ఊర్లో నాలుగు రోజులు సంతోషంగా గడుపుతుంటారు. ఆరుగాలాల పాటు పొలంలో కష్టపడి పనిచేసిన రైతులు, ఉత్తరాయణ కాలంలో పంటను ఇంటికి తీసుకొచ్చి మార్కెట్ ను అమ్మకానికి ఇస్తారు.
ఇలా మార్కెట్ కు తీసుకెళ్లిన పంటకు సంబందించిన డబ్బులు చేతికి వస్తాయి. వచ్చిన డబ్బులతో ఉన్నదానిలో అద్భుతంగా పండగ చేసుకుంటారు. పిల్లా పాపలు అందరు ఇంటికి రావడంతో వారికి కావాల్సినవి అన్ని ఇస్తుంటారు. అంతేకాదు, ఈ పండగ రోజున పెద్దలను తలచుకొని వారికి తర్పణం విడవడం వలన పితృ దేవతలు సంతోషిస్తారు. ఫలితంగా మంచి జరుగుతుందని వారి నమ్మకం.
ఈ నమ్మకంతోనే ప్రజలు ఈ పండగ చేసుకుంటారు. ఇక ఇదిలా ఉంటె, కొత్తబట్టలు వేసుకొని పెద్దలకు నమస్కారం చేయడం అన్నది ఒక సంస్కారం. ప్రతి పండగ రోజున పెద్దలకు నమస్కారం చేస్తే వారి ఆయుష్షు కూడా పోసుకొని మరికొన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని కోరుకుంటారు. పెద్దలను తలచుకొని వాళ్లకు తగిన ఉపచారాలు చేయడమే ఉత్తమ గుణం అని చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటె, పండగ పర్వదినం సందర్భంగా పేదలకు దానధర్మాలు చేయాలి. దుఃఖాన్ని అందరితో పంచుకోకపోయినా పర్వాలేదు. కానీ, ఆనందాన్ని మాత్రం అందరితో పంచుకోవాలి. పెద్దలు చెప్పిన నీతి ఇదే. ఇదే మనల్ని రక్షిస్తుంది. ఇదే మనల్ని ముందుకు నడిచేలా చేస్తుంది. ప్రతి విషయంలో మనం ఎలా ముందుకు వెళ్లాలో ఎలా అందరితో మసలుకోవాలో తెలియజేసేది ఇదే అని చెప్పాలి. సంక్రాంతి నుంచి మంచు తెరలు తెరలుగా తొలగిపోవడం మొదలుపెడుతుంది. ఇలా మంచు దుప్పట్లు తొలగిపోయి వెచ్చని సూర్యుడు వెలుగులు పంచుతుంటాడు. అప్పటి వరకు చలితో వణికిపోయిన ప్రజలు వెచ్చగా జీవించేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.