ఇక్కడ ప్రతి భక్తునికి ఒక డౌట్ ఉంది. అదేమంటే ఎస్వీబీసీ చైర్మన్ పదవులు ఎందుకు సినిమా వాళ్లకే ఇస్తారు ?. వారే ఈ పదవికి న్యాయం చేస్తారా? అని ఎందుకంటే గత చంద్రబాబు పాలనలో ఈ పదవిని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు కట్టబెట్టారు. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చాక సహజంగానే రాఘవేంద్రరావు తప్పుకున్నారు. ఆ సమయంలో హాస్యనటుడు పృథ్విని ఎస్వీబీసీ ఛైర్మన్గా చేశారు ముఖ్యమంత్రి జగన్.
కానీ అనుకోని పరిస్దితుల వల్ల కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సినీ నటుడు పృథ్వి ఆ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ప్రస్తుతం తాజాగా శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానెల్ ఛైర్మన్ ఎవరు అనేదానిపై వెంటనే ఆలోచనలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఇకపోతే ఈ ఛానెల్ టీటీడీకి సంబంధించింది అయినప్పటికీ ఛైర్మన్ను నియమించేది ముఖ్యమంత్రి జగనే.
ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారికే ఈ పదవులు దక్కుతున్నాయి. అదే విధానంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని కూడా పాలక పార్టీ వారికే కట్టబెడుతుండగా, అది మరీ సినిమా రంగానికి చెందిన వ్యకికే ఇస్తున్నారు. సరే… నామినేటెడ్ పదవులు పాలక పార్టీవారికే ఇస్తారనుకోండి. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఎస్వీబీసీ చైర్మన్ పదవులు మాత్రం సినిమా రంగానికి చెందినవారినే ఎందుకు ఎంపిక చేస్తున్నారో అర్థంకాని సంగతి.
ఇకపోతే ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్ పదవికి, పేరు వినిపిస్తున్న వారిలో మొదటి వ్యక్తి సినిమా దర్శకుడు శ్రీనివాస రెడ్డి, రెండో వ్యక్తి టీవీ యాంకర్ కమ్ న్యూస్ రీడర్ స్వప్న. ఇక ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏంటంటే దర్శకుడు శ్రీనివాస రెడ్డి పేరు ఈ పదవికి ఖరారు అయ్యేలా ఉందట. ఎందుకంటే ఈయన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితడు. ఆయనకు క్లోజ్ అయినప్పుడు జగన్కు కాకుండా ఉండడు కదా.
అందుకని ఆయన పేరు బాగా వినిపిస్తోందని అనుకుంటున్నారు. ఇకపోతే ఈ పదవికి అర్హత కలిగిన వారు వీరిద్దరే కాకుండా చాలామంది భక్తులు ఉన్నారు. అందుకే సినిమా రంగానికి చెందినవారిని కాకుండా పార్టీ వ్యక్తులే వేరే రంగాలకు సంబంధించిన వారిలోనే మెరుగైన వారిని నియమించవచ్చు కదా. జగన్ ఆ దిశగా ఎందుకు ఆలోచించరు అని కొందరు అనుకుంటున్నారట..