ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనపై.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సుధీర్ఘ లేఖ రాశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఏపీ రాజధాని మార్చవద్దని సూచించిన సుజనా.. ఒక వేళ రాజధాని మార్చాలంటే ప్రభుత్వానికి 4 లక్షల కోట్లు అవసరమవుతుందన్నారు. 

 

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా తప్పుబట్టారు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. రాజధాని మార్పు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్మోహన్ రెడ్డికి 10 పేజీలతో సుదీర్ఘ లేఖ రాశారు. 2014లో రాజధాని అమరావతి నిర్ణయాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. సీఎం జగన్‌ బాధ్యతలు స్వీకరించాక అమరావతిలో 42 వేల కోట్ల పనుల్ని కారణం లేకుండా నిలిపివేశారని తెలిపారు.

 

విశాఖపట్నంలో పాలనా రాజధాని ఏర్పాటు కోసం భవనాలు వెతుకుతున్నట్టు మంత్రుల ప్రకటనలు, రాజధానిలో ఆందోళనలు బాధ కల్గిస్తున్నాయని సుజనా చౌదరి లేఖలో వివరించారు. రాజధాని మార్పు వల్ల తలెత్తే దుష్పరిణామాలను తన లేఖలో ఎత్తిచూపారు సుజనా చౌదరి. రాజధాని తరలింపు ఆర్థికంగా, న్యాయపరంగా దుష్పరిణామాలను చూపిస్తుందని.. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా తరలింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని సూచించారు కేంద్ర మాజీ మంత్రి.

 

12 శాతం భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, 88 శాతం భూముల్ని నిరుపయోగంగా మారుస్తారా అంటూ ప్రశ్నించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని తాను ఎన్నోసార్లు సీఎం జగన్‌ని కోరినట్టు లేఖలో స్పష్టంగా తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయలు అవుతుందన్న వాదన కూడా నిజం కాదన్న ఆయన.. మూడు రాజధానులు ఆచరణ సాధ్యం కాదని తెలిపారు.

 

రాజధానిని తరలిస్తే రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని.. లక్షా 89 వేల 117 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు సుజనా చౌదరి. రాజకీయాలను పక్కనపెట్టి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. చెట్టును రక్షిస్తే అది మనకు నీడనిస్తుందని.. అలాగే అమరావతిని రక్షిస్తే అది రాష్ట్రానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుందని తెలిపారు. 

 

ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే 3 వేల కోట్ల రూపాయలతో పెండింగ్‌ పనులు పూర్తిచేస్తే.. అమరావతి నుంచే పాలన సాగించేందుకు అవసరమైన అన్ని హంగులు సమకూరతాయన్నారు సుజనా. నిధులు లేవనే సాకు చూపి రాజధాని మార్చటమనేది సరైన నిర్ణయం కాదన్నారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సుజనాచౌదరి సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: