టీడీపీ పాలనలో అభివృద్దికి అడ్రస్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు, జూదాలకు నిలయంగా మారిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 3 రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల ప్రజల ఆత్మాభిమానంతో జగన్ చెలాగాటమాడుతున్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్చందంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలుపుతున్న వారిపై దాడులు చేయిస్తున్న ప్రభుత్వం చట్ట వ్యతిరేకమైన కోడిపందాలు, గుండాట, పేకాటలను ప్రోత్సహించటం సిగ్గుచేటు.
మహిళా రైతులపై జరిగిన దాడులను కోర్టు తప్పి పట్టింది. కోడి పందాలను నిర్వహించొద్దంటూ న్యాయస్ధానం ఆదేశాలిచ్చినా వైసీపీ మంతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కోడిపందాలు, గుండాటల నిర్వహకులుగా మారి అక్రమంగా కోట్లు దండుకుంటూ..జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతల ఆధ్వర్యంలో కోడిపందాలు, గుండాట, పేకాట, మద్యం షాపులు నిర్వహిస్తున్నప్పటీకి పోలీసులు చోద్యం చూస్తున్నారు.
వైసీపీ అదికారంలోకి వస్తే రాష్ట్రంలో గుండాయిజం, జూదం, మద్యం మాఫియా, క్రికెట్ బెట్టింగ్లు విచ్చలవిడవుతుందని మేం ఎన్నికలకు ముందే చెప్పాం. నేడు అదే రుజువైంది. జూదగాళ్లను జగన్మోహనరెడ్డి ప్రోత్సహించటం సిగ్గుచేటు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్లబ్లను రద్దు చేశామని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారు. మరో వైపు మాత్రం పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు వైకాపా నేతల ఆద్వర్యంలోనే యథేచ్ఛగా జూదాలు జరుగుతున్నాయి.
అందరికి అన్నం పెట్టే రైతన్న పండుగ నాడు కూడా పస్తులుండి రాజధాని కోసం నిరసనలు చేస్తుంటే...జగన్ మాత్రం సంక్రాంతి సంబరాలు చేసుకోవటం విడ్డూరంగా ఉంది. ప్రజల సమస్యలు పట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ప్రజలు ఆవేదన వ్యక్తం చేసున్నారు. 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల మద్య చిచ్చు పెట్టి జగన్ ప్రజల బావోద్వేగాలతో ఆటలాడుతుంటే మరో వైపు వైసీపీ నేతలు జూదాలకు పాల్పడుతూ రాక్షసానందం పొందుతున్నారు. రైతులు సంక్రాంతిని బహిష్కరించి రోడ్డుపై భైఠాయించి రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.