రాజధాని అమరావతి ప్రాంతంలో వివాదాస్పదమైన అంశాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ కూడా కీలకమైనదే. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి రాజధాని ప్రాంతంలో చంద్రబాబునాయుడు, బినామీలు, సన్నిహితులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ఎవరెవరు ఎంతెంత లబ్ది పొందారనే విషయాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో వివరించారు.
సరే ఈ విషయమై అధికార, ప్రతిపక్షాల నేత మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అందరు చూస్తున్నదే. ఇదే విషయమై ఈనెల 20వ తేదీన జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సంచలన ప్రకటన చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. నిజానికి ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నది రాజకీయ వ్యవహారాల్లో నిరూపించేందుకు సాధ్యంకాదు. జరిగింది వాస్తవమే అయినా సరైన ఆధారాలుండవు. అందుకనే ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా టిడిపి నేతల అవినీతిని నిరూపించేకంటే బినామా చట్టాన్ని ప్రయోగించి విచారణ జరిపించాలంటూ వైసిపి నేతలే జగన్ కు సూచిస్తున్నారు.
అదే సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సిబిఐ, లోకాయుక్త లాంటి సంస్ధల్లో ఏదో ఒకదానితో విచారణ జరిపించాలని కూడా క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే దేనితో విచారణ చేయించబోతోందనే విషయంలో స్పష్టత లేదు. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ఈ విషయంపైన కూడా ఓ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. నిజంగానే జగన్ ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సీరియస్ గా ఉంటే విచారణ/ దర్యాప్తును కూడా సీరియస్ గానే చేయించాలని వైసిపి నేతలు బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి ముందుముందు చంద్రబాబు అండ్ కో కు ముందుంది మొసళ్ళ పండగ అనే అనుకోవాలేమో.