జనసేన పార్టీ ఈరోజు బీజేపీ నేతలతో భేటీ కాబోతున్నది. ఈ భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఎలా పోరాటం చేయాలి అనే విషయాలను చర్చించబోతున్నారు. వీటితో పాటుగా అమరావతి విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు అమరావతి రైతులకు అండగా ఉండేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జనసేన చేపట్టిన అనేక ఆందోళన కార్యక్రమాల్లో బీజేపీ పాల్గొనలేదు. అలానే బీజేపీ ఆందోళనలో జనసేన పాల్గొనలేదు.
కానీ, ఈ రెండు పార్టీలు కలవబోతున్న తరుణంలో ఇకపైన రాష్ట్రంలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఉమ్మడిగా చేపట్టాలని నిర్ణయించే అవకాశం ఉన్నది. అమరావతి రైతుల కోసం కలిసే పోరాటం చేయబోతున్నాయి. అంతేకాదు, రెండు పార్టీలు కలిసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎలాగైనా వైకాపాను దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. దీనికోసమే పవన్ ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమే ఇప్పటి వరకు తేలలేదు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎలాగైనా లాభం పొందాలని బాబు చూస్తున్నారు. అంతేకాదు, జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా ఇటీవల జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కూడా ఇదే అభిప్రాయానికి వచ్చారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే పవన్ హడావుడిగా ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్ని అంశాల గురించి కేంద్రంలోని పెద్దలతో పవన్ చర్చించారు. రాష్ట్రంలో అమరావతి రైతులు పడుతున్న ఇబ్బందులను గురించి వివరించారు.
పవన్ చెప్పినవి విన్న తరువాత ఢిల్లీ పెద్దలు కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎలాగో బీజేపీ సౌత్ లో బలం పుంజుకోవాలని చూస్తున్నది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన ఆ పార్టీకి పెద్దగా ఉపయోగం లేదు. ఎదగడానికి స్కోప్ లేకుండా పోయింది. ఎప్పటి నుంచో బీజేపీ రాష్ట్రంలో ఎదగాలని చూస్తున్నా కుదరడం లేదు. ఇప్పటికి అవకాశం దక్కింది. వైకాపా అధినేత తీసుకుంటున్న నిర్ణయాల వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రాన్ని ఇచ్చి, రాజధానిని ఇస్తే, దానిని డెవలప్ చేసుకోకుండా, ఎక్కడికో వెళ్లి చేస్తాం అనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.