ఇపుడిదే సందేహం అందరిలోను వినిపిస్తోంది. ప్రత్యేకహోదా డిమాండ్ తో జగన్మోహన్ రెడ్డి తన ఆరుగురు ఎంపిలతో రాజీనామాలు చేయించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి అదే పని చంద్రబాబునాయుడు కూడా ఎందుకు చేయకూడదు ? అనే ప్రశ్న అందరిలోను వినిపిస్తోంది. రాజధానిని అమరావతి నుండి తరలించాలంటే మళ్ళీ ప్రజాతీర్పును కోరాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. పైగా వైసిపి ఎంఎల్ఏలతో వెంటనే రాజీనామా చేయించాలని పదే పదే సవాళ్ళు విసురుతున్నారు.
రాజీనామాలపై జగన్ కు చంద్రబాబు సవాలు విసరటంలోనే మాజీ సిఎం చవకబారు ఎత్తుగడలు ఏమిటో అందరికీ అర్ధమైపోతోంది. రాజధానిని తరలించాలన్న జగన్ ప్రతిపాదన నచ్చకపోతే చంద్రబాబు తన ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించాలి కానీ జగన్ ఎందుకు రాజీనామాలు చేస్తాడు ? అప్పుడు కూడా ఏపికి కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా తన ఎంపిలతో జగన్ రాజీనామా చేయించారు.
అలాగే ఇపుడు కూడా జగన్ నిర్ణయం ఇష్టం లేకపోతే చంద్రబాబే రాజీనామాలు చేస్తే సరిపోతుంది కద. ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయిస్తే జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. తర్వాత ఉపఎన్నికలు వచ్చినపుడు జనాలు టిడిపి అభ్యర్ధులను గెలిపిస్తారో లేకపోతే వైసిపి అభ్యర్ధులను గెలిపిస్తారో తేలిపోతుంది. అన్నీ స్ధానాలను టిడిపినే గెలిస్తే జగన్ ప్రతిపాదన తప్పని చంద్రబాబు చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే కొన్ని స్ధానాల్లో అయినా కానీ వైసిపి గెలుచుకుంటే చంద్రబాబు వాదన తప్పని నిరూపణైనట్లు అనుకోవాలి.
మరింత బంగారం లాంటి అవకాశాన్ని వదిలేసుకుని చంద్రబాబు మాత్రం జగన్ ను ఎదురు డిమాండ్ చేయటంలో అర్ధమే లేదు. ఇంతచిన్న విషయం చంద్రబాబుకు తెలీక కాదు. అయినా ఎందుకు డిమాండ్ చేస్తున్నట్లు ? ఎందుకంటే ఇప్పటికే జగన్ ప్రతిపాదనకు విశాఖపటన్నం సిటిలో గెలిచిన నలుగురు టిడిపి ఎంఎల్ఏలు మద్దతు పలికారు. ఒకవేళ చంద్రబాబు రాజీనామాలు చేయమని ఆదేశించినపుడు వాళ్ళు గనుక రాజీనామాలు చేయకపోతే చంద్రబాబు పరిస్ధితేంటి ? అందుకనే అంత ధైర్యం చేయటం లేదట.