ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయిబరేలీలో దారుణం చోటు చేసుకుంది. ఇప్పటికే రెండు కాన్పులలో ఆడపిల్లలను కన్న తన భార్య మూడో కాన్పులోను ఆడపిల్లను కంటుందనే అనుమానంతో ఆమె భర్త కిరాతకంగా మహిళను చంపేశాడు. ఆ తరువాత ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఆ ముక్కలను తగులబెట్టాడు. తన తండ్రి చేసిన దారుణాన్ని పెద్ద కుమార్తె బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే తొమ్మిది సంవత్సరాల క్రితం రాయిబరేలి ప్రాంతానికి చెందిన రవీంద్రకు ఊర్మిళ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి 9,7 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కానీ రవీంద్ర మాత్రం తనకు కొడుకు మాత్రమే కావాలని ఎంతో ఆశ పడుతూ భార్యను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. మరోసారి భార్య గర్భం దాల్చటంతో ఈసారి కూడా ఆడపిల్ల పుట్టవచ్చనే అనుమానంతో తండ్రి, సోదరుని సహాయంతో భార్యను గొంతు నులిమి చంపేశాడు. 
 
ఆ తరువాత పదునైన కత్తిని తీసుకొని మహిళ శరీరాన్ని ముక్కలుముక్కలుగా కోసేశాడు. ఆ తరువాత పిండమరలో ముక్కలను వేసి ఆ ముక్కలు ముద్దగా అయ్యేలా చేశాడు. ఆ తరువాత కొన్ని శరీర భాగాలను పెట్రోల్ పోసి ఇంట్లోనే కాల్చి దహనం చేశాడు. కాలని శరీర భాగాలను కొంతదూరం తీసుకెళ్లి ఊరి బయట పడేశాడు. ఊర్మిళ కుటుంబ సభ్యులు ఎన్ని రోజులైనా ఊర్మిళ నుండి ఫోన్ కాల్ రాకపోవడంతో రవీంద్రను ఊర్మిళ గురించి నిలదీశారు. 
 
కానీ ఊర్మిళ గురించి అతని నుండి ఎటువంటి సమాచారం రాకపోవడంతో పోలీసులకు ఊర్మిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఊర్మిళ, రవీంద్ర కూతుళ్లను విచారించగా పెద్ద కూతురు తన నాన్న, తాతయ్య తల్లిని చంపేశారని చెప్పడంతో పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకొని విచారించారు. మూడు కాన్పులోనైనా కొడుకు పుడతాడో లేదో అనే అనుమానంతో భార్యను చంపేశానని చెప్పడంతో పోలీసులు, ఊర్మిళ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పోలీసులు ఈ కేసులో నిందితులైన రవీంద్ర తండ్రి, సోదరుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: