ఒక వ్యక్తి.. అక్రమంగా సంపాదిస్తున్నాడు.. లేదా ఎక్కువ సంపాదిస్తున్నాడు.. అంటే ట్యాక్స్ వేసిన పెద్ద విషయం కాదు. కానీ అతడు ఒక నిరుపేద.. రెక్కాడితే కానీ డొక్కాడదు.. అలాంటి నిరుపేదకు కోటి రూపాయిల రూపాయలు ట్యాక్స్ కట్టాలంటూ నోటిసు వచ్చింది. ఈ వింత ఘటన మహారాష్ట్రలో జరిగింది.. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర, థానేలోని అంబివాలిలో నివసించే భావూసాహెబ్ అహిరే అనే వ్యక్తి దినసరి కూలి. రోజూకు రూ. 300 కోసం ఆ వ్యక్తి పనిచేస్తాడు. అలాంటి దినసరి కూలికి ఐటీ అధికారులు ఒక కోటి అయిదు లక్షలు ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. వినడానికి వింతగా ఉన్న ఆ నోటీసు నిజంగానే పంపించారు. 

 

ఇలా నోటీసు రావడం అహిరేకి ఇది రెండవసారి. మొదటి నోటీసును గత సెప్టెంబర్ నెలలో అందుకున్నాడు. కానీ దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అతను దినసరి కూలి.. అతనికి ఇలా రావడం ఎవరో ఆట పట్టించడం అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు జనవరి 7వ తేదీన మరోసారి నోటీసు అందుకున్నాడు. 

 

దీంతో అతను చేసేది ఏమి లేక పోలీసులను ఆశ్రయించాడు. అసలు విషయం అప్పుడు బయటపడింది. 2016లో నోట్ల రద్దు జరిగిన సమయంలో అహిరే ఖాతాలో రూ. 58 లక్షలు డిపాజిట్ అయ్యాయి. అందుకుగాను కోటి రూపాయలు ట్యాక్స్ కట్టాలని నోటీసు వచ్చిందని అహిరే తెలుసుకున్నాడు. 

 

రోజుకు రూ. 300 లకు పనిచేసే తనకు.. అంత డబ్బు లేదని వాపోయాడు. అసలు ఆ ఖాతా తనది కాదని అహిరే అన్నాడు. ఈ విషయంపై సదరు బ్యాంకు సిబ్బందిని అడిగితే, అహిరే పేరు మీదనే ఎవరో నకిలీ ఖాతా తెరిచారని తెలిసింది. ఆ ఖాతా ఓపెనింగ్ కోసం అహిరే పాన్ కార్డును ఉపయోగించారని తేలింది. 

 

ఫొటో కూడా ఎవరిదో పెట్టడంతో పాటు సంతకం కూడా ఫోర్జరీ చేశారని తేలింది. దాంతో అహిరే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా నకిలీ ఖాతాలు తెరిస్తే బ్యాంకు సిబ్బంది ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయినా దినసరి కూలికి కోటి రూపాయిలు జరిమానా అంటే మాములు విషయమా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: