హైవేల మీద ఎంత స్పీడ్ గా వాహనాలు దూసుకుపోయినా, టోల్ ప్లాజాల వద్దకు రాగానే బ్రేకులు పడాల్సిందే. పండగల సమయంలో టోల్ ప్లాజాల వద్ద చూసుకుంటే భారీ క్యూలు ఉంటున్నాయి. ఈ క్యూలను దాటుకొని బయటపడాలి అంటే నరకం కనిపించేది. కానీ, ఇప్పుడు ఆ జంజాటన లేదు. ఈజీగా దాటొచ్చు. ఈజీగా అన్ని పనులను చక్కదిద్దుకోవచ్చు. అదెలా అంటే, ఫాస్టాగ్ విధానం. అవును.. ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది.
టోల్ ప్లాజాల వద్ద ఆన్లైన్ లోనే అమౌంట్ కట్ అయ్యేలా రూపొందించిన విధానమే ఈ ఫాస్టాగ్ విధానం. దీనిని వెహికిల్ ముందుభాగంలో వేసుకుంటారు. టోల్ ప్లాజా వద్దకు వెహికిల్ రాగానే ఆటోమాటిక్ గా అమౌంట్ కట్ అవుతుంది. ఈ విధానం అమలులోకి రావడంతో వెహికిల్స్ ఈజీగా పాస్ అవుతున్నాయి. అయితే, ఫాస్టాగ్ విధానం అమలులోకి తీసుకొచ్చినా చాలామంది ఈ ఫాస్టాగ్ ను కొనుగోలు చేయకపోవడంతో కేంద్రం డెడ్ లైన్ తీసుకొచ్చింది.
ఈ డెడ్ లైన్ కూడా ఈనెల 14 వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. ఫాస్టాగ్ తీసుకున్న వాళ్లకు మాత్రమే రాయితీలు ఉంటాయి. 24 గంటల్లో టోల్ ప్లాజా నుంచి పాస్ అయిన వెహికిల్ తిరిగి వెనక్కి వస్తే రాయితీ ఉంటుంది. ఇప్పుడు ఆ రాయితీని ఫాస్టాగ్ ఉంటేనే ఇస్తున్నారు. లేదంటే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా నెలవారీ పాసుల్లో కూడా రాయితీ ఉంటుంది.
అది కూడా ఫాస్టాగ్ ఉంటేనే. ఇలా రాయితీలు మొత్తం ఫాస్టాగ్ ద్వారానే ఇస్తుండటంతో ఫాస్టాగ్ తీసుకోవడానికి వినియోగదారులు ఉత్సాహం చూపుతున్నారు. ఇకపోతే, రాష్ట్రంలో 17 ప్రాంతాల్లో ఉన్న టోల్ప్లాజాల్లో 15 చోట్ల ఇదే విధానం అమల్లోకి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్ప్లాజా, బెంగుళూరు హైవే మీదున్న రాయికల్ టోల్ప్లాజాలను దీని నుంచి మినహాయించారు. ఈ రెండు ప్లాజాల్లో మరో నెల రోజులు 25 శాతం హైబ్రీడ్ లేన్లు నగదు చెల్లించేందుకు అందుబాటులో ఉంటాయి.