బ్బాబ్బాబు రాజధానిగా అమరావతిని తరలించవద్దంటూ జగన్మోహన్ రెడ్డిని బతిమలాడుకుంటున్నారు.  ముందేమో బెదిరించారు. తర్వాతేమో హెచ్చరించారు. ఇపుడేమో చివరకు బతిమలాడుకుంటున్నారు. ఇదంతా ఎవరి గురించో ఈ పాటికే మీకు అర్ధమైపోయుంటుంది.  అవును బిజెపి నేతలు సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళ  గురించే  ఇదంతా.

 

జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రకటన చేయగానే సుజనా మాట్లాడుతూ అమరావతి నుండి రాజధానిని అంగుళం కూడా కదల్చలేరంటూ భీకర ప్రకటన ఒకటి చేశారు. రాజధానిని కదిల్చే ప్రయత్నం చేస్తే కేంద్రప్రభుత్వం చూస్తూ ఊరుకోదంటూ తీవ్ర హెచ్చరికలే చేశారు. ఆయన ఉద్దేశ్యమేమిటంటే బెదిరిస్తే జగన్ బెదిరిపోతాడని. సుజనా బెదిరించినా జగన్ వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. దాంతో మళ్ళీ మళ్ళీ అదే బెదిరింపులకు దిగారు.

 

సరే ఏమనుకున్నారో ఏమో తర్వాత రాజధానిని తరలించటం కష్టమంటు హెచ్చరికలకు దిగారు. రాజధాని తరలింపును అడ్డుకోలేకపోతే ఇక తమలాంటి వాళ్ళు దేశంలో ఉండి ఏమి లాభమంటూ తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నారు. ఒకవేళ రాజధానిని తరలించాలని అనుకుంటే రైతులకు, ఇతరులకు నష్ట పరిహారం క్రింద రూ. 2 లక్షల కోట్లు చెల్లించాల్సుంటుందని హెచ్చరించారు. దీనికి కూడా జగన్ నుండి రెస్పాన్స్ లేదు.

 

ఇక లాభం లేదనుకున్న సుజనా రెండు రోజుల క్రితం జగన్ కు ఓ లేఖ రాశారు. అందులో బ్బాబ్బాబు రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ బతిమలాడుకున్నారు. నువ్వు అమరావతిని రక్షిస్తే అమరావతే ఏపిని రక్షిస్తుందనే సూక్తులు మొదలుపెట్టారు.  అంటే బెదిరింపుల నుండి బతిమలాడుకునే దాకా సుజనా దిగిపోయిన విషయం స్పష్టమైపోతోంది.

 

అలాగే తాజాగా కన్నా లక్ష్మీనారాయణ కూడా దిగిపోయారు. మొదట్లో ఏమో ఆయన కూడా కేంద్రం చూస్తూ ఊరుకోదని బెదిరించారు. ఇపుడేమో రాజధానిని అమరావతి నుండి జగన్ తరలిస్తాడని తాను అనుకోవటం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.  అంటే వీళ్ళకి అర్ధమైపోయిన విషయం ఏమిటంటే రాజధాని తరలింపు ఆగదని. అలాగే రాజధాని తరలింపు విషయంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోదని. అందుకనే బెదిరింపుల నుండి బతిమలాడుకుంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: