గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న రాజ‌కీయ విశ్లేష‌ణ‌ల‌ను నిజం చేస్తూ జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ విష‌యంలో అనేక అంచ‌నాలు, విప‌క్షాల నుంచి ఆరోప‌ణ‌లు, విశ్లేష‌కుల నుంచి వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో...పవన్ కళ్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో స‌మావేశం అయ్యాల‌ని జ‌న‌సేనాని డిసైడ‌య్యారు. బీజేపీతో పొత్తు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయవలసిందిగా జనసేన పార్టీ అధ్యక్షుడు నేత‌ల‌ను ఆదేశించారు. 

 

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు టి. శివశంకర్, బొలిశెట్టి సత్య, పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి, త‌న‌ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్‌తో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రానున్న నాలుగు వారాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాల ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వారితో పాటు తమ తమ వృత్తులు, ఉద్యోగాలు కొనసాగిస్తూ పార్టీ కోసం కష్టపడే వారి జాబితాలు తయారు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని ప‌వ‌న్ వెల్ల‌డించారు. బీజేపీతో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై కార్యకర్తల సమావేశాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. 

 

 

గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలందరినీ గుర్తించి వారిని ఆదరించాల్సిన అవసరం ఉందని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌కు చెప్పారు. జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలు, పబ్లిక్ పాలసీస్, పార్టీ ఆలోచనా విధానం,  వర్తమాన రాజకీయ అంశాలపై ఎంపిక చేసిన కార్యకర్తలకు వర్క్ షాప్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని   ఆయ‌న చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను రూపొందించాలని పార్టీ నేత‌ల‌కు ప‌వ‌న్ సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన యువ అభ్యర్ధుల సమావేశాలను కూడా ఏర్పాటు చేయవలసిందిగా ప‌వ‌న్‌ చెప్పారు. పార్టీలో ఉంటూ సామాజిక సేవ చేయాలన్న తలంపు ఉన్నవారితో సేవాదళ్ ను పటిష్టంగా రూపొందించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: