సూపర్ స్టార్ మహేష్ ప్రధాన పాత్రలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో రష్మిక మంథాన కథానాయికగా నటించింది. దాదాపు 13 ఏళ్ళ తర్వాత విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ కార్యక్రమం వరంగల్ జేఎన్ఎస్ స్టేడియంలో శుక్రవారం ఘనంగా జరిగింది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సూపర్ స్టార్ మహేష్ బాబు, సినీ ప్రముఖులు విజయశాంతి, దిల్ రాజు, రశ్మిక మందన్న, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, దేవిశ్రీప్రసాద్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, పోలీస్ కమిషనర్ వి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ ఊహించని ఆఫర్ ఇచ్చారు. సినిమా వాళ్లు హైదరాబాద్ తరువాత వరంగల్ అడ్డాగా ఎంచుకోవాలి అని సూచించారు. ``కాళేశ్వరం నీళ్లతో వరంగల్ను మరో కోనసీ చేశాం. మీరు వరంగల్కు వస్తాను అంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో మాట్లాడి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. మాకు దిల్ రాజు, వంశీ పైడిపెల్లి ఉన్నారు. వారి సహకారంతో సినిమా ఇండస్ట్రీని వరంగల్ కి తీసుకువస్తారని ఆశిస్తున్నా. దర్శకులు అనిల్ రావిపూడికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా... వరంగల్ కేంద్రంగా సినిమా తీయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ఒక్క రోజే ముందుగా చెప్పినా జిల్లా కలెక్టర్, సీపీ గారు చేసిన ఏర్పాట్లను మీరు చూసారు. ఇక ముందు కూడా ఇలానే ఉంటుంది.`` అని ఆఫర్ ఇచ్చారు. దీనికి మహేష్ నవ్వుతూనే స్పందించారు. కాగా, ఈ సక్సెస్ మీట్కు ముందు సరిలేరు నీకెవ్వరూ సినిమా విజయం సాధించడంతో తిరుమల శ్రీవారికి చిత్ర యూనిట్ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వరంగల్ విచ్చేశారు.