బీజేపీతో కలసి నడవాలన్న పవన్ కల్యాణ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటానన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏకంగా వారికి బద్ద శత్రువైన బీజేపీతో కలిసి నడవాలని డిసైడ్ కావడం విమర్శలకు తావిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ అంటేనే విరుచుకుపడే వైసీపీ నేతలు ఈ పరిణామంతో మరింత జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా పవన్ కల్యాణ్ ను కేఏ పాల్ తో పోల్చి విమర్శలు చేస్తున్నారు.
మాటల్లో వెటకారమే ఆభరణంగా మాట్లాడే మంత్రి పేర్నినాని పవన్ పై బులెట్లలాంటి విమర్శలతో కుమ్మేశారు. ప్రజాశాంతి పార్టీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా చంద్రబాబు చెప్పినట్లే చేస్తాయని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఇదంతా కూడా చంద్రబాబు గేమ్లో ప్లానే. దాని గురించి మేం పెద్దగా ఆలోచించడం లేదన్నారు మంత్రి పేర్ని నాని. వైయస్ జగన్, వైయస్ఆర్సీపీ ఈ రాష్ట్ర ప్రజలను నమ్ముకుంది. ప్రజలే మాకు పొత్తు..వాళ్లతోనే అన్ని కూడా. ఎత్తులు, పైఎత్తులు అన్నీ కూడా చంద్రబాబుకు సరిపోతాయి. వాళ్లు ఏం మాట్లాడినా పరిగణలోకి తీసుకోం అంటూ కుండ బద్దలు కొట్టారు మంత్రి పేర్ని నాని.
ఆయన ఇంకా ఏమన్నారంటే..” జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేషరత్గా బీజేపీకి ఎందుకు లొంగిపోయారు.. పవన్ను మించిన అవకాశవాద రాజకీయవేత్త ఎవరు ఉండరు. ఓఎల్ఎక్స్లో పార్టీనీ పెట్టిన సైద్ధాంతికతత్వవేత్త పవన్.. చంద్రబాబు కూడా ముక్కున వేలేసుకునేలా అవకాశ వాద రాజకీయాలు పవన్ ఈ రోజు చేయడం ప్రారంభించారు. అవకాశ రాజకీయాలకు కొత్త చిరునామాగా మారిన పవన్ నాయుడు ఏం మాట్లాడినా విలువేముంటుంది? అని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని.
2014లో పవన్ చెప్పిన వారే అధికారంలోకి వచ్చారు. 2019లో కూడా వారు తీసుకువచ్చిన వైయస్ జగన్ అధికారంలోకి వచ్చారు. మళ్లీ 2024లో కూడా వైయస్ జగన్ అధికారంలోకి వస్తారు. ఇవన్నీ కూడా మనం వింటాం అన్నారు మంత్రి పేర్ని నాని.