పౌరసత్వ సవరణ చట్టంపై ఓ వైపు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీ గలం విప్పుతుంటే...మరోవైపు అదే చట్టం ఆధారంగా ఆయన్ను టార్గెట్ అయిపోతున్నారు. ఓ వైపు రాహుల్ విపక్షాలతో కలిసి సభలు, సమావేశాలకు ప్లాన్ చేస్తుంటే...మరోవైపు రాహుల్ తీరును విశ్లేషకులు ఎండగడుతున్నారు. తాజాగా ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోజికోడ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీని మళ్లీ ఎన్నుకుని మలయాళీలు తప్పు చేయకూడదని సూచించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల బెంగుళూరులో రామచంద్ర గుహ ధర్నా చేశారు. అప్పుడు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యాన్ని రామచంద్ర గుహ ప్రస్తావిస్తూ తనకు రాహుల్ గాంధీపై ఎటువంటి వ్యక్తగత కక్ష లేదని తెలిపారు. రాహుల్గాంధీ మంచి వ్యక్తి, సద్గుణాలు కలిని వ్యక్తే అని, కానీ యువ భారత్కు ఓ కుటుంబానికి చెందిన అయిదో తరం నాయకుడు అవసరం లేదని గుహ తెలిపారు. 2024లో రాహుల్కు ఓటేస్తే.. అప్పుడు అది మోదీకి అడ్వాంటేజ్గా మారుతుందని, అందుకే మలయాళీలు అలాంటి పొరపాటు చేయకూడదని చరిత్రకారుడు తెలిపారు. కుటుంబ రాజకీయాలకు పాల్పడుతున్న రాహుల్(వయనాడ్ ఎంపీ) లాంటి నేతలకు అవకాశం ఇవ్వడం వల్లే బీజేపీ లాంటి పార్టీ బలపడిందని అన్నారు. దీంతో విధానపరమైన నిర్ణయాల్లో బీజేపీ ఎవర్నీ లెక్క చేయడం లేదని రామచంద్రగుహ విశ్లేషించారు.
ఇదిలాఉండగా, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని విశ్వవిద్యాలయాలకు వెళ్లి.. విద్యార్థులను కలిసే దమ్ము ప్రధాని నరేంద్ర మోదీకి ఉందా? అని సవాల్ విసిరారు. ఆర్థిక వ్యవస్థను మోదీ భ్రష్టు పట్టించారని.. దానిపై విద్యార్థులకు సమాధానం ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో చదువుకున్న యువత నిరుద్యోగులుగా మారిన దుస్థితి నెలకొని ఉందన్నారు. దేశానికి మోదీ ఏం చేయదలుచుకున్నారో ప్రజలకు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశాన్ని విభజించే కుట్ర మోదీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. యువత గొంతును నొక్కేయాలనుకోవడం మంచిది కాదని రాహుల్ అన్నారు. విద్యార్థుల ముందుకు వెళ్లే ధైర్యం మోదీకి లేదన్నారు