తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం గురించి మరో ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్న తరుణంలో...మరోవైపు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకో హాట్ చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం పీఠం నుంచి కేసీఆర్ వైదొలిగి తనయుడు కేటీఆర్ అధిరోహిస్తారనేది ఆ ప్రచారం సారాంశం. దీనికి తగ్గట్లుగా కొన్నిపరిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయితే, తన కుటుంబంలో ఉన్న ఒత్తిడి గురించి తాజాగా కేటీఆర్ స్పందించారు.
గత కొంతకాలంగా, వరుసగా తెలంగాణలోని మంత్రులంతా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జై కొడుతున్న తీరు, పార్టీ శ్రేణులలో చర్చనీయాశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాక కేటీఆర్కు పట్టాభిషేకం జరుగుతుందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనికి తోడుగా... పది రోజులుగా సొంత పార్టీ శ్రేణులే ఈ క్యాంపెయిన్ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. స్వయంగా మంత్రులు, పార్టీ ముఖ్యులు సీఎం కేసీఆర్ తర్వాత కాబోయే తెలంగాణ సీఎం కేటీఆరేనంటూ జపం చేస్తుండగా..ఇదే సమయంలో మునుపెన్నడూ లేని రీతిలో...టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిరుమల టూర్ చర్చకు తెరలేపింది. దేవుడు, భక్తి అంటేనే పెద్దగా ఆసక్తి చూపని కేటీఆర్ తిరుమల దర్శనం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కలియుగ దైవం, కోరిన కోరికలు తీసే దేవుడిగా పేరొంది తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఓ వైపు ముఖ్యమంత్రి సీటును కేటీఆర్ స్వీకరిస్తారనే చర్చ మరోవైపు... కేటీఆర్ దర్శనం నేపథ్యంలో..సహజంగానే ఏదో జరుగుతోందనే భావన కలుగుతుంది. ఇదే విషయాన్ని ఓ విలేకరి తాజాగా నేరుగా కేటీఆర్నే అడిగేశారు. మీరు ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం నిజం చేస్తూ.... నాస్తికుడైన మీరు ఇటీవల తిరుమల వెళ్ళడం ఈ చర్చను మరింత పెంచింది... దీనికి మీ సమాధానం ``నాకు కుటుంబం ఉంది. భార్యా, పిల్లల నుండి ప్రెషర్ ఉంటుంది. ఒక్కోసారి వినాలి కదా. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. నా దృష్టంతా మునిసిపల్ చట్టం అమలుపైనే.`` అంటూ కేటీఆర్ తనదైన శైలిలో తేల్చేశారు.