రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తించిన భారతీయ జనతా పార్టీ-జ‌న‌సేన పొత్తు గురించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మ‌రోమారు స్పందించారు. ఈ పొత్తు గురించి వివిధ వ‌ర్గాలు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం, జ‌న‌సేన‌కు చెందిన కొంద‌రు నేత‌లు సైతం పెద‌వి విరుస్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ-జ‌న‌సేన పొత్తు చాలా లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని పార్టీ నేత‌ల‌కు వివ‌రించారు.

 

హైదరాబాద్  ప్రశాసన్‌న‌గర్‌లోని జ‌న‌సేన‌ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ ముఖ్య నేత‌ల‌తో ప‌వ‌న్ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఇటు తెలంగాణ రాజ‌కీయాల‌తో పాటుగా అటు పార్టీ గురించి, ఏపీ గురించి సైతం ప‌వ‌న్ ప్ర‌స్తావించారు. తెలంగాణాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చెప్పారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పడు పార్టీని తెలంగాణాలో బలోపేతం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప‌వ‌న్‌ వెల్లడించారు. ఇక నుంచి నెలలో కొన్ని రోజులపాటు తెలంగాణాలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ గ్రేటర్ కమిటీని కార్యకర్తల నుంచి పేర్లు అందిన వెంటనే ప్రకటించనున్నట్లు చెప్పారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించుకుందామని, అర్హులయిన పేర్లను కార్యకర్తలే సూచించాలని ప‌వ‌న్  అవకాశం ఇచ్చారు. కమిటీల ఏర్పాటు కార్యకర్తల అభీష్టం మేరకే జరుగుతుందని స్పష్టం చేశారు. 

 

భారతీయ జనతా పార్టీతో పొత్తు గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందిస్తూ మాట్లాడుతూ బీజేపీలోని అన్ని స్థాయిల నాయకులతో చాలా లోతైన చర్చలు జరిగిన తరువాతనే తెలుగు రాష్ట్రాలు, మన దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పొత్తు ఏర్పాటు జరిగినట్లు చెప్పారు. గత కొన్ని నెలలుగా పొత్తుపై బీజేపీ అగ్ర నాయకత్వంతో దఫదఫాలుగా చర్చలు జరిగాయని ప‌వ‌న్‌ చెప్పారు. పొత్తుపై ఇరు పక్షాల నుంచి ఎటువంటి షరతులు లేవని వెల్లడించారు. నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీతో కలసి పనిచేసినట్లు గుర్తుచేశారు. అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. లేని పక్షంలో అపోహలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఉదాహరణకు సిటిజెన్ అమెండ్మెంట్ యాక్ట్ (సి.ఎ.ఎ.)ను అర్ధం చేసుకోవడంలో చాలామంది కొంత అపోహకు  గురవుతున్నారని చెబుతూ ఈ చట్టం వల్ల దేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లింకు అపకారం జరగదని చెప్పారు. దీనిపై కూలంకషంగా మాట్లాడుతూ ఈ చట్టం రూపకల్పనకు దారితీసిన దేశ విభజన నాటి పరిస్థితులు, భారత్, పాకిస్థాన్ మధ్య గల ఒప్పందాల గురించి ప‌వ‌న్ వివరించారు. ఆ నాటి ఒప్పందాలను పొరుగు దేశం అమలు చేయకపోవడం కారణంగా అక్కడి మైనారిటీల రక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చిందని వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: