అమెజాన్...సుప్రసిద్ధ కంపెనీ. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యల్లో నిలిచారు. బెజోస్ భారత్ వచ్చారు. వెళ్లిపోయారు. ఈ టూర్లో భారత్లో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు, బోలెడు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించారు. అయితే, ఆయన టూర్ను కేంద్రం లైట్ తీసుకుంది. విదేశీ పెట్టుబడిదారులను కలుసుకునే అవకాశాలను ఏమాత్రం వదులుకోని ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. కేంద్ర పెద్దలెవరూ కూడా బిజోస్తో భుజాలు రాసుకోలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అదో పెద్ద పెట్టుబడా అంటూ వెటకారం చేశారు. ఇలా ఆసక్తికర పరిణామాలకు వేదికగా మారిన బెజోస్ విషయంలో బీజేపీ వైఖరిపై ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది.
జెఫ్ బెజోస్ అపర కుబేరుడు అనే సంగతి తెలిసిందే. ఇటీవలే విడాకుల పుణ్యమా అని ఆస్తి సగానికి సగం తగ్గిపోయింది. అయినా సంపన్నుల జాబితాలో ఇప్పటికీ ఆయనది అగ్రస్థానమే. బెజోస్కు చాలా వ్యాపారాలున్నాయి. అందులో వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రిక కూడా ఒకటి. పలుకుబడి కలిగిన ఆ పత్రిక తరచుగా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా రాస్తుంది. కశ్మీర్ 370 రద్దు మొదలుకుని తాజాగా సీఏఏ వరకు మోదీ విధానాలను తూర్పార పడుతోంది. ఇది సహజంగానే బీజేపీకి కంటగింపుగా తయారైంది. ఆ పార్టీ విదేశీ వ్యవహారాల ప్రతినిధి డాక్టర్ విజయ్ చౌతాలా ట్విట్టర్లో చేసిన విమర్శే ఇందుకు నిదర్శనం. వార్తలు సరిగా రాయాలని మీ వాషింగ్టన్ పోస్ట్ ఉద్యోగులకు చెప్పండి అంటూ ఆయన ట్విట్టర్లో బెజోస్కు సలహా ఇచ్చారంటే...ఎంత సీరియస్గా గమనిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే, బెజెస్ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బీజేపీ నేతలకు బెజోస్ సమాధానం ఇవ్వకుండా వాషింగ్టన్ పోస్ట్ ద్వారా ఇప్పించారు. ``మాది ఇండిపెండెంట్ జర్నలిజం.. మేం ఎలా వార్తలు రాయాలో బెజోస్ చెప్పరు`` అంటూ ఆ పత్రిక ఘాటుగా సమాధానం ఇచ్చింది.
అయితే, ఈ వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. బెజోస్ రాక, పెట్టుబడులు, బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ``ఆ పత్రిక మీ పార్టీ ప్రభుత్వాన్ని విమర్సిస్తున్నదనే కారణంగా విదేశీ పెట్టుబడిదారులను దూరం పెడతారా? 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను తయారు చేసేది ఇలాగేనా?`` అని మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం సర్కారుపై అక్షింతలు వేశారు.