తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటి ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఈ ఎన్నికల ఖర్చు అసెంబ్లీ స్థాయి మించి పెరిగిపోవడంతో పాటు ఎక్కడికక్కడ తిరుగుబాటు అభ్యర్ధుల వెన్నుపోట్లు మధ్య ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కూడ సాధారణ ఎన్నికల స్థాయిలో జరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజలకు మంచి సేవ అందించాలి అన్న ఉద్దేశ్యంతో 97 సంవత్సరాల వయస్సులో ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిన ఈ బామ్మకు సంబంధించిన వార్తను చదివితే ఎవరైనా స్పూర్తిని పొందుతారు. 

రాజస్థాన్ లోని పురాణబస్ ప్రాంతానికి చెందిన పంచాయితీ ఎన్నికలలో ఆ గ్రామ సర్పంచ్ గా ఎన్నిక అయిన ఈ బామ్మ పేరు విద్యాదేవి. 97 ఏళ్ల వయసులో కూడ చకచకా నడుస్తూ నలుగురుకి సేవ చేయాలన్న తపనతో పంచాయితీ ఎన్నికలలో పోటీ చేసి సర్పంచ్ గా ఎన్నిక అయిన ఈమె తన ఎన్నికల పాద యాత్రలో రెండు కిలోమీటర్లు నడిచింది అన్న విషయం తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాలిసిందే.

అంతేకాదు మన దేశంలోనే సర్పంచ్ గా ఎన్నికైన అతి పెద్ద వయస్కురాలిగా ఈమె రికార్డ్ క్రియేట్ చేసింది. తన ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్కరోజు కూడ ఒక్క వాహనం ఎక్కకుండా నడుస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసిన ఈమె పట్టుదల చూసి ఈమెకు సంబంధించిన వార్తలను కవరు చేయడానికి జాతీయమీడియా ప్రతినిధులు ఆమెతో ఇంటర్వ్యూ చేయడానికి ప్రత్యేకంగా రాజస్థాన్ లోని ఆ గ్రామానికి వెళ్ళారు అంటే ఆమె ఇప్పుడు జాతీయ స్థాయి మీడియా దృష్టిని ఎలా ఆకర్షించిందో అర్ధం అవుతుంది.

ఇంత అతి పెద్ద వయసులో కూడ ప్రజలకు ఎంతోకొంత సేవ చేయాలి అన్న ఆకాంక్ష ఆమె మాటలలో వినిపించడం చూసి జాతీయ మీడియా వర్గాలు కూడ షాక్ అయినట్లు సమాచారం. ప్రతి గ్రామానికి అవసరమైన మంచినీరు పరిశుభ్రత పాడైపోయిన రోడ్లకుకు మరమ్మతులు చేయించడమే తన ధ్యేయం అంటూ ఈమె చేసిన ప్రచారాన్ని నమ్మి ఆ ఊరి ప్రజలు ఆమెకు ఘన విజయాన్ని ఇచ్చారు. ఇదే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రాంత ఓటరు కూడ తన ఊరుకు మంచిచేసే అభ్యర్ధులను కులం మతం డబ్బు ప్రభావాలకు లోనుకాకుండా గెలిపించి నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకుందాం..  

మరింత సమాచారం తెలుసుకోండి: