పుర’పోరులో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. గతంలో కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆశ చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సంఘం అభ్యర్థి ప్రచారానికి ఖర్చు, కఠినమైన ప్రవర్తనా నియమావళి ఉండడం కేవలం నిబంధనలకు మాత్రమే పరిమితం అఈయిందని...ఎక్కడికక్కడ డబ్బుల వరద సాగుతోందని అంటున్నారు. ప్రధానంగా ఓ మున్సిపాల్టీలో ఓటుకు 3000 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనగామ పుర పోరులో బరిలో నిలిచిన అభ్యర్థులు ఇలా డబ్బులు కుమ్మరిస్తున్నారని తెలుస్తోంది.
జనగామ మున్సిపల్ ఎన్నికల్లో మంగళవారం నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత 163 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. 268 మంది అభ్యర్థులు 413 నామినేషన్ల దాఖలు చేయగా, వాటిలో ఒకటి కంటే ఎక్కువ సెట్లు వేసిన వాటిని మినహాయించి చివరి రోజు 105 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బల్దియా పోరులో ప్రధాన రాజకీయ పార్టీలు, స్వతంత్రులతో కలిసి 163 మంది బరిలో నిలిచారు. టీఆర్ఎస్-30, కాంగ్రెస్-29, బీజేపీ-30, సీపీఐ-3, సీపీఎం-3, టీడీపీ-13, స్వతంత్రులు-55 మంది ఎన్నికల పోరులో నిలిచారు.
ఇక ఎన్నికల బరిలో భాగంగా పలు వార్డుల్లో అత్యధికంగా పలు వార్డుల్లో అభ్యర్థులు రంగంలోకి దిగారు. 1వ వార్డులో అత్యధికంగా 10 మంది అభ్యర్థుల చొప్పున పోటీ పడుతుండగా 10, 15, 29 వార్డుల్లో 9 మంది, అత్యల్పంగా 4, 11, 18, 19, 22 వార్డుల్లో ముగ్గురు చొప్పున రంగంలో నిలిచారు. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొన్నది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీలకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించిన 50 గుర్తుల్లో ఒక్కో అభ్యర్థికి మూడు గుర్తులను ఆప్షన్స్లో కోరుకునే అవకాశంతో సహా పేరు ఆధారంగా వచ్చే మొదటి అక్షరాన్ని నిబంధనగా తీసుకొని దాని ప్రకారం గుర్తులను కేటాయించారు. అయితే, ఇటు అధికార-ప్రతిపక్ష పార్టీలు అటు స్వతంత్ర్యులు అనే తేడా లేకుండా అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఒక్కో ఓటుకు 3000 కూడా ఇచ్చేందుకు నాయకులు సిద్ధమైనట్లు సమాచారం.