రాజుల సొమ్ము రాళ్లపాలు.. లోభి సొమ్ము పరులపాలు అవుతుందంటారు పెద్దలు. కానీ దొంగల సొమ్ము ఏమవుతోందో.. ఎవరూ చెప్పలేదు. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు దొరుకుతోంది. దొంగల సొమ్మంతా ఎవరికీ పనికిరాకుండా నాశనమవుతుందని.. బీరు మల్లయ్య ఆస్తులు చూస్తే అర్ధమవుతోంది.

 

భారత వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ఫ్రాన్స్‌లోని ఓ ద్వీపంలో... కొనుగోలు చేసిన విలాసవంతమైన భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటుంది. 17 పడక గదులు, సినిమా థియేటర్‌, హెలిప్యాడ్‌, నైట్‌క్లబ్‌లతో.. విలాసంగా ఉండే ఈ సౌధంలో గత కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మత్తులు జరగలేదు. కనీసం మెయింటెన్స్ చేసేవారు కూడా లేకపోవడంతో.. అది చాలా వరకు దెబ్బతింది. 

 

ఫ్రెంచ్‌ ద్వీపమైన ఇలీ సెయింటీ మార్గరైట్‌లో 1.3 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 'లీ గ్రాండ్‌ జార్డిన్‌' భవనాన్ని 2008లో కొనుగోలు చేశారు విజయ్‌ మాల్యా. ఇందుకోసం ఖతార్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎస్‌ఏక్యూకు చెందిన.. అన్స్‌బాచర్‌ అండ్‌ కో యూనిట్‌ నుంచి మాల్యా 30 మిలియన్‌ డాలర్ల రుణం తీసుకున్నారు. గిజ్మో ఇన్వెస్ట్‌ కంపెనీ పేరుతో లోన్‌ తీసుకోగా.. ఆ తర్వాత రుణాన్ని తిరిగి చెల్లించలేదు. 

 

ప్రస్తుతం పరిస్థితుల్లో రుణం చెల్లించలేకపోతున్నట్టు.. మాల్యా తెలపడంతో బ్యాంక్ ఆ సౌధాన్ని పరిశీలించింది. భవనాన్ని మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసిన బ్యాంకు.. చాలా వరకు అది దెబ్బతిన్నట్టు గుర్తించింది. అంతేగాక, దాని మార్కెట్‌ విలువ కూడా 10 మిలియన్ల మేర పడిపోయిందట. దీంతో.. మాల్యాపై మండిపడ్డ అన్స్‌బాచర్‌ అండ్‌ కో అతనిపై కోర్టులో దావా వేసింది. 

 

భవనం కొనుగోలు చేసేందుకు తీసుకున్న రుణానికి తనఖాగా మాల్యా.. సూపర్‌యాచ్‌ను సెక్యూరిటీగా పెట్టాడు. ఆ సూపర్‌యాచ్‌ను అమ్మి రుణం చెల్లించేలా ఆదేశాలివ్వాలని అన్స్‌బాచర్‌ సంస్థ లండన్‌లోని న్యాయస్థానాన్ని కోరింది. అయినా, రుణం తీరకపోవడంతో మాల్యా సౌధాన్ని కూడా అమ్మకానికి పెడుతున్నట్టు తెలిపింది ఆ బ్యాంక్. 
మరోవైపు.. భారత్‌లోని బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు రుణం ఎగ్గొట్టిన మాల్యాపై ఈడీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు యూకే న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: