లోతుగా అధ్యయనం చేసిన తరువాతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని ముఖ్య నాయకులతో పవన్ సమావేశమయ్యారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకునే పొత్తు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

 

తెలంగాణాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు పవన్ తెలిపారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఇప్పడు పార్టీని తెలంగాణాలో బలోపేతం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. బీజేపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. బీజేపీలోని అన్ని స్థాయిల నాయకులతో చాలా లోతైన చర్చలు జరిగిన తరువాతే పొత్తు నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు, ప్రజల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పొత్తు ఏర్పాటు జరిగినట్లు తెలిపారు. 

 

గత కొన్ని నెలలుగా పొత్తుపై బి.జె.పి. అగ్ర నాయకత్వంతో దఫదఫాలుగా చర్చలు జరిగాయని పవన్ వివరించారు. ఇరుపక్షాల నుంచి ఎటువంటి షరతులు లేకుండా పొత్తు కుదిరిందని చెప్పారు. అయితే బి.జె.పి. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. లేని పక్షంలో అపోహలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

 

సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో చాలామందికి అపోహలున్నాయని పవన్ అన్నారు. ఈ చట్టం వల్ల దేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లింకు అపకారం జరగదని... ఈ చట్టం రూపకల్పనకు దారితీసిన దేశ విభజన నాటి పరిస్థితులు, భారత్, పాకిస్థాన్ మధ్య గల ఒప్పందాల గురించి వివరించారు. ఆ నాటి ఒప్పందాలను పొరుగు దేశం అమలు చేయకపోవడం కారణంగా అక్కడి మైనారిటీల రక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చిందని వివరించారు. ఇక నుంచి నెలలో కొన్ని రోజులపాటు తెలంగాణాలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కార్యకర్తల నుంచి పేర్లు అందిన వెంటనే హైదరాబాద్ గ్రేటర్ కమిటీని ప్రకటించనున్నట్లు పవన్ తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: