ఏపీలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు పెద్ద అయోమయం దేవాలయం మాదిరిగా మారిపోయింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలే కాదు చివరకు గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబును నమ్మడం లేదు. పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు బాబు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసి బయటకు వచ్చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్తో పాటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు పార్టీకి దూరమయ్యారు. ఇక పార్టీకి ఉన్న 21 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఎప్పుడు ఎవరు బాబుకు షాక్ ఇస్తారో కూడా అర్థం కావడం లేదు.
శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్ ఇద్దరూ కూడా డుమ్మా కొట్టేయడంతో పార్టీ శ్రేణుల్లో మరింత గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ తరపున అసలు జెండా మోసే నాథుడే కూడా లేని పరిస్థితి వచ్చేసింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎంజాయ్ చేసిన మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీ కండువా కప్పేసుకున్నారు.
మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైతం వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు అదే బాటలో మరో కీలక నేత కూడా ఉన్నట్టు టాక్..? కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి త్వరలోనే వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి మాట విన్న చంద్రబాబు ఆయనకు సీటు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటూనే వస్తున్నారు.
తాజాగా వీర శివ వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అనిల్ కుమార్రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలోనే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఏకంగా 90 శాతం హామీలు అమలు చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డే అని ఆయన ప్రశంసించారు. ఈ క్రమంలోనే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వీర శివారెడ్డి త్వరలోనే వైసీపీలో చేరుతున్నట్టు చెప్పారు. ఏదేమైనా వీర శివా కూడా వైసీపీలో చేరితే కడపలో బాబుకు మరో పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది.