బీజేపీ, జనసేన చేతులు కలిపి ఏపీలో టీడీపీ, వైసీపీలకు తామే ప్రత్యామ్నామం అని వచ్చే ఎన్నికల్లో తమ కూటమే అధికారంలోకి వస్తుందని కలలు కనడం ప్రారంభించేశాయి. ఇక బీజేపీ రాజకీయ కుట్రలో ఇప్పటికే టీడీపీ బలవ్వగా.. నేడో రేపో పవన్ కూడా బలవ్వబోతున్నాడన్నదే రాజకీయ విశ్లేషకుల మాట. ఏపీలో బీజేపీ అంటే నాయకులే తప్పా కేడర్ ఎవ్వరూ ఎప్పటకీ ఉండరు.. ఉండబోరు అన్నది వాస్తవం. రాష్ట్రానికి ఆ పార్టీ చేసిన ద్రోహాన్ని ఎవ్వరూ అంత సులువుగా మర్చిపోలేని పరిస్థితి. అలాంటి పార్టీతో ఏపీకి హోదా అంటూ ఎన్నో నాటకాలు ఆడి రక్తికట్టించిన పవన్ కలవడాన్ని ఎవ్వరూ జీర్ణించు కోలేకపోతున్నారు.
ఈ క్రమంలో.. వైసీపీ నేతల నోటి నుంచి వస్తున్న ప్రధానమైన విమర్శ..చంద్రబాబు చెప్పినట్లుగా పవన్ కల్యాణ్ చేస్తున్నారనేదే. నిన్నటి వరకు బాబోరి దత్తపుత్రుడిగా పవన్ నేడు బీజేపీ చంకలో దూరేసి ఆ పార్టీ పుత్రుడిగా మారిపోయాడు. ఇప్పుడున్న రాజకీయ సమీకరణలు, మేథావుల విశ్లేషణలు చూస్తే అధికార వైసీపీ నెత్తిన మళ్లీ పాలు పోసినట్టే అవుతుంది. జనసేన పార్టీకి ఆరు శాతం.. బీజేపీకి ఒక్క శాతం ఓట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీల ఓటింగ్ 12 శాతం వరకు ఉన్నా అది టీడీపీకి పెద్ద మైనస్ అవుతుంది.
హిందువుల్లో కొంత ఓటింగ్ను బీజేపీ బలంగా చీల్చుతుంది. అదే టైంలో కాపుల్లో యువతతో పాటు కొందరి ఓటింగ్ జనసేనకు పడుతుంది. ఇవన్నీ టీడీపీకి పడే ఓట్లే కావడం గమనార్హం. అదే సమయంలో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా అటు టీడీపీ, ఇటు బీజేపీ, జనసేనల మధ్య చీలిపోతుంది. ఇది అంతిమంగా వైసీపీకే ప్లస్ అవుతుంది. అందుకే బీజేపీ - జనసేన పొత్తుతో ఆ రెండు పార్టీల నేతల కన్నా వైసీపీ నేతలకే ఎక్కువ ఆనందం కలిగిస్తోంది.
ఇక వాస్తవంగా చూస్తే నిజమైన జనసేన కేడర్, పవన్ అభిమానులు ఎవ్వరూ కూడా బీజేపీతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఏపీలో కలిస్తే జనసేన కూడా ఎక్కడ భూస్థాపితం అయిపోతుందో ? ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీని ఎక్కడ ముంచేస్తుందో ? అన్న ఆందోళనలో వారు ఉన్నారు. టీడీపీతోనే పొత్తులకు వెళదామని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలు పవన్కు నేరుగా చెప్పారు కూడా. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే స్థానిక ఎన్నికల్లో కనీస సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉండదని వారు చెప్పారు.
అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో పాటు నిన్న మొన్నటి వరకు మోదీ, అమిత్ షా భజన చేస్తున్న పవన్ చివరకు కమలం చెంతకే చేరాడు. ఏదేమైనా నీళ్లు లేని గ్లాసులో దూరేసిన కమలం పార్టీ ఏపీలో అంతిమంగా ఫ్యాన్ స్పీడ్ మరింత పెంచేసి.. ఇప్పటికే విరిగిపోయిన సైకిల్ చక్రాలు మరింత విరగ్గొట్టేసి ఫాత సామాన్లకు పడేసేలా చేసింది.