ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపధ్యం లో ఇప్పుడు  అందరి దృష్టి ఏపీ అసెంబ్లీపైనే  కేంద్రీకృతం అయింది . శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లో  మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన చేసిన విషయం తెల్సిందే . రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నియమించిన జీఎన్ రావు నిపుణుల కమిటీ , బోస్టన్ సంస్థ ఇచ్చిన నివేదికలు  కూడా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం  మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని సూచించాయి . దీనితో  రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసి , జీఎన్ రావు కమిటీ, బోస్టన్ సంస్థ నివేదికలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది .

 

ఆ రెండు నివేదికలను ఇప్పటికే మూడుసార్లు సమావేశమైన  హైపవర్ కమిటీ అధ్యయనం చేసి తన  నివేదిక ను  సోమవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది .  కేబినెట్ భేటీ లో హైపవర్ కమిటీ నివేదికను  ఆమోదించి , అనంతరం అసెంబ్లీలో చర్చించనున్నారు . రాష్ట్రం లో మూడు రాజధానుల ఏర్పాటు కు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెల్సిందే . అమరావతిని శాసన, విశాఖ ను పరిపాలన, కర్నూల్ ను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .  అయితే ప్రధాన ప్రతిపక్షం , ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది .

 

దానిలో భాగంగానే సోమవారం అసెంబ్లీ ముట్టడికి అమరావతి రైతులిచ్చిన పిలుపుకు మద్దతునిస్తుంది . అసెంబ్లీ సమావేశాల నేపధ్యం లో  సభ బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలుండడం తో ఇప్పటికే పోలీసులు 144  సెక్షన్ అమలు చేస్తూ ,  సభలు , సమావేశాలు, ర్యాలీలు  నిషేదించారు . సభ బయట పరిస్థితి ఎలా ఉన్న సభ లో ఏమి జరగనుందనేది  ఉత్కంఠ సర్వత్రా నెలకొంది . ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారి కళ్లన్నీ, రేపు ఉదయం  ఏపీ అసెంబ్లీపైనే  కేంద్రీకృతం కావడం ఖాయం . 

మరింత సమాచారం తెలుసుకోండి: