అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2014 ఎన్నికలకు ముందు జగన్ ఒక్కసారి సీఎం కుర్చీ మీద కూర్చుంటే సరిపోతుందని భావించారు. ఎన్నికల్లో గెలుపు సమీపం వరకు వచ్చి దూరమవడంతో జగన్ లో కసి మరింతగా పెరిగింది. ఇక అప్పటి నుంచి పార్టీపరంగా నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజల్లో బలం పెంచుకునే దిశగా అడుగులు వేశాడు. అదేవిధంగా పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతా ప్రజల కష్టసుఖాలను పూర్తిగా తెలుసుకున్నాడు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రావడంతో ప్రజల కష్టాలను తీర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
అధికారంలోకి వచ్చింది మొదలు తమకు ఎదురే లేదు అన్నట్టుగా జగన్ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడడం లేదు. ఎక్కడ అవినీతి అనే మాట వినిపించుకోకుండా జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. 2019 ఎన్నికలకు ముందు నుంచి జగన్ చెబుతున్నది ఒకటే మాట... నేను 30 ఏళ్లుగా సీఎం గా ఉంటాను అంటూ ఆయన చెబుతున్న తీరు పై ఇప్పుడు కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. సిపిఐ నారాయణ కూడా జగన్ అమరావతి నుంచి రాజధాని తరలిస్తూ తీసుకున్న నిర్ణయంపై స్పందించారు.
జగన్ పరిపాలన పై ప్రశంసలు వస్తున్న సమయంలో ఇలా రాజధాని వ్యవహారాన్ని జగన్ అనవసరంగా తెరమీదకు తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్నారని, జగన్ తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకుంటున్నాడు అంటూ విమర్శించారు. జగన్ 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటాను అని చెప్పుకుంటున్నారు. ఆయన రాజధానిని మార్చాలనే నిర్ణయం తీసుకోకుండా ఉంటే కనీసం 15 ఏళ్ళు అయినా ఎదురు లేకుండా పాలించే వాడిని, ఇప్పుడు అమరావతి వ్యవహారంతో మూడేళ్ల సీఎం కుర్చీ కూడా ఆయన దక్కించుకునే పరిస్థితుల్లో లేరని ఆయన విమర్శిస్తున్నారు.
అదేవిధంగా తెలుగుదేశం నాయకుడు, ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ కూడా ఈ విషయంపై స్పందించారు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి పరిపాలన కాలంలో సాగించిన పాలనలో పదోవంతు అమరావతి లో కూర్చుని చేస్తే జగన్ మూడు సార్లు ముఖ్యమంత్రి అయి ఉండే వారిని, కానీ జగన్ కి రాజధాని తరలించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ? ఎవరు సలహా ఇచ్చారో తెలియదు గాని, ఆయనను పూర్తిగా తప్పుదోవ పట్టించారు అని విమర్శిస్తున్నారు. అమరావతిని యథాతథంగా ఉంచి మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఆయనకు తిరిగి ఉండేది కాదు అంటూ అశ్వినిదత్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జగన్ నిర్ణయం అయితే తీసేసుకున్నారు.
ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. అమరావతి అంశం జగన్ ను హీరోని చేస్తుందా ? లేదా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. జగన్ 30 ఏళ్ల రాజకీయ భవిష్యత్తును ముందుగానే ఊహించుకుని మార్పు చేర్పులు చేపడుతున్నారని, విపక్షాలకు అందనంత దూరంగా ఆయన రాజకీయాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు అనేది మెజార్టీ ప్రజల భావన.