అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉండటం, అసెంబ్లీ ముట్టడికి టీడీపీ పిలుపివ్వడంతో, హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రధానంగా, ఈ సమావేశాలకు సీఎం జగన్ను కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురానున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు. విశాఖ పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా మారొచ్చు అని గత నెల 17వ తేదీన ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటను శాసనంగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే ప్రతి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తరువాత తప్పకుండా కమిటీలు వేస్తుంది.
ఎందుకంటే కమిటీల ద్వారానే ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయి. గతంలో అమరావతి ఏర్పాటు విషయంలో తెలుగుదేశం పార్టీ నారాయణ కమిటీ వేసింది. టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీని వేసింది. ఈ కమిటీల పని నిజాలను నిగ్గు తేల్చడమే అనే విషయం అందరికి తెలుసు. నారాయణ కమిటీ మాత్రం ఏకపక్షంగా వ్యవహరించి అమరావతి నిర్మాణం వైపుకు మొగ్గు చూపిందని వాదనలు ఉన్నాయి. అయితే వాస్తవానికి కావాలనే శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తొక్కేసి నారాయణ కమిటీ వేశారు. అందులో రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలే ఉన్నారంటున్నారు.
మరోవైపు గ్రీన్ఫీల్డ్ కేపిటల్ అన్నారు. కాని అది ఎల్లో బ్యాచ్ దోపిడీ కమిటీ అయ్యింది. ఇక ప్రస్తుతం ప్రజలను మభ్యపెట్టడానికి అమరావతి ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి కోసం చంద్రబాబు మరోసారి జోలె కూడా పట్టారు. రాజధాని ప్రాంత రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు కూడా చేశారు. రాజధానిలో రైతులు బాబు మాయలో పడొద్దని, రైతులకు జగన్ ఎలాంటి అన్యాయం చేయబోడని వైకాపా ప్రభుత్వం చెప్తున్నది. అయినా సరే ఇక్కడ ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. మరి వీరందరి ఉత్కంఠకు తెర పడే రోజు రానే వచ్చేసింది.