రిలయన్స్ జియో రాకతో భారతీయ టెలికం రంగ ముఖచిత్రమే మారిపోయింది. ముఖ్యంగా టెలికం పరిశ్రమలో ధరల యుద్ధం చోటుచేసుకున్నది. ఈ ధరల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకే వొడాఫోన్, ఐడియాలు ఒక్కటైయ్యాయి. ఈ సమయంలోనే టెలీకాం సేవల్లో ప్రముఖంగా ఉన్న భారతీ ఎయిర్టెల్ సైతం తన వినియోగదారుల కోసం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ లాభాల్లో వాటాలు తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో ఎయిర్టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
రూ.179తో రీచార్జి చేసుకున్న వారికి రూ.2 లక్షల జీవిత బీమా కవరేజ్ కల్పించనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందుకోసం భారతీ అక్సా లైఫ్ ఇన్సూరెన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నూతన ప్లాన్లో అన్లిమిటెడ్ కాలింగ్తోపాటు 2 జీబీ డాటా, 300 ఎస్ఎంఎస్లు, రూ.2 లక్షల బీమా కూడా లభించనున్నదని తెలిపింది. 28 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్ను మోస్తరు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎంట్రిలెవల్ స్మార్ట్ఫోన్, ఫీచర్ ఫోన్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించింది. 18 నుంచి 54 ఏళ్లు లోపు వయస్సు కలిగిన వారికి మాత్రమే ఈ బీమా కవరేజ్ను కల్పిస్తున్న సంస్థ..ఇందుకోసం ఎలాంటి పేపర్వర్క్, మెడికల్ టెస్ట్ అవసరం లేదని పేర్కొంది.
ఎయిర్టెల్ మొబైల్ నంబర్ రీచార్జి చేసుకున్న వారి కుటుంబానికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా సదుపాయం కల్పించినట్లు భారతీ ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ అధికారి శశ్వంత్ శర్మ తెలిపారు. ఇదివరకే ప్రకటించిన బీమా ప్లాన్లకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. వాటికి కొనసాగింపుగా తమ విలువైన వినియోగదారులకు మరింత మంచి సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని శశ్వంత్ శర్మ తెలిపారు. కాగా, భారతీ ఎయిర్టెల్ తీసుకున్న ఈ నిర్ణయం మార్కెటింగ్ టెక్నిక్ అయినప్పటికీ... గ్రామీణులకు మాత్రం మేలు చేయడం ఖాయమని అంటున్నారు.