ఏపీ విభజన బిల్లుపై సోమవారం అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ చర్చ ప్రధానంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ పైనే జరిగింది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం నేతలు భూ బాగోతాలను ఆధారాలతోసహా.. సర్వే నెంబర్లతో సహా వివరించారు. దీనిపై తెలుగుదేశం నేతల నుంచి పెద్దగా వ్యతిరేకత కూడా రాలేదు. అయితే పయ్యావుల కేశవ్ మాత్రం దీనిపై గట్టిగా అధికార పార్టీని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో ఆయన అనుకోకుండా చంద్రబాబును ఇరుకున పెట్టేశారు. నిన్న పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. నేను 2014 అక్టోబర్లో భూములు కొన్నాను నాది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదని చెప్పారు. అంటే రాజధాని ప్రకటన వచ్చాక కొన్నానని ఆయన చెప్పారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. బాబోరి హెరిటేజ్ కోసం కొన్న భూములు జూన్లో కొన్నారు. అప్పటకీ రాజధాని ప్రకటన రాలేదు. అంటే కేశవ్ నాది.. ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు బాబుది, మిగిలిన పార్టీ నేతలది ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఒప్పుకున్నట్టేనా అన్న సందేహాలు ఉన్నాయి.
అసలే చంద్రబాబుపై పయ్యావుల కేశవ్ అసహనంతో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇలా మాట్లాడి పయ్యావుల కేశవ్ ను చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేశారు. రాజుగారి చిన్న భార్య అందమైంది అంటే పెద్ద భార్య కాదనేది లోకోక్తి. ఇప్పుడు నాది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదని పయ్యావుల వాదిస్తున్న తీరు చూస్తే .. చంద్రబాబు అండ్ కో లో చాలా మంది ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు ఈ వాదన తెలుగుదేశం నేతలను ఇరుకున పెడుతోంది. మిగిలినవాళ్లంతా పెద్దగా ప్రతిఘటన లేకుండా ఉన్న సమయంలో పయ్యావుల కేశవ్ ఒక్కడే తాను నీతిపరుడినని నిరూపించుకునే ప్రయత్నంలో పాపం.. అధినేతనే ఇరుకున పడేశాడని తెలుగుదేశం నేతలు చెప్పుకుంటున్నారు.