తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. ఇద్దర ఎంఎల్సీలు ఒకేసారి చంద్రబాబుకు షాకిచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎంఎల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ రాజీనామా చేశారు. అనంతపురంలో సీనియర్ నేత ఎంఎల్సీ శమంతకమణి సమావేశాలకు గైర్హాజరయ్యారు. కొద్ది కాలంగా డొక్కా పార్టీతో అంటి ముట్టనట్లు ఉంటున్నారు. చంద్రబాబు కార్యక్రమాలకు కూడా హాజరవ్వటం లేదు.
మూడు రాజధానుల వివాదంపై ప్రత్యేకంగా మొదలైన మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు ఎంత వాడి వేడిగా జరుగుతోందో అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపధ్యంలోనే డొక్కా తన రాజీనామా లేఖను చంద్రబాబకు పంపటం సంచలనంగా మారింది. ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయటమే కాకుండా పార్టీకి కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో చెప్పటం గమనార్హం.
జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనకు ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటి సభ్యుల ఆమోదం తెలిపారు. ఈ రోజు మొదలవుతున్న శాసనమండలి సమావేశాల్లో కూడా ఈ ప్రతిపాదనలు బిల్లు రూపంలో చర్చ జరుగుతుంది. అంటే మండలిలో కూడా ఓటింగ్ జరగటం ఖాయమనే అనుకోవాలి. మరి మండలిలో వైసిపికి మెజారిటి లేదు. 58 మంది సభ్యులు గల మండలిలో టిడిపికి 26 మంది సభ్యులున్నారు. మరి ఎంఎల్సీలందరూ ఎటువైపు ఓటు వేస్తారో అన్నది ఆసక్తిగా మారింది.
ఈ నేపధ్యంలోనే టిడిపి ఎంఎల్సీ రాజీనామా చేయటం పార్టీలో సంచలనంగా మారింది. అలాగే మరో ఇద్దరు ఎంఎల్సీలు శమంతకమణి, రత్నాబాయ్ సమావేశానికే హాజరుకాలేదు. దాంతో తన పార్టీలో ఏం జరుగుతోందో అసలు చంద్రబాబుకే అర్ధం కావటం లేదు.
మొన్నటికి మొన్న టిడిఎల్పి సమావేశం నిర్వహిస్తే 26 మంది ఎంఎల్సీల్లో 12 మంది అడ్రస్ లేరు. అలాగే 23 మంది ఎంఎల్ఏల్లో ఏడుగురు హాజరుకాలేదు. దాంతో టిడిఎల్పి లోనే రాజధానుల అంశంపై తీవ్ర విభేదాలున్నట్లు బయటపడింది. అయితే అది ఇంత తొందరగా ఓటింగ్ కు ముందు ప్రభావం చూపుతుందని ఎవరూ అనుకోలేదు. మరిపుడు మండలిలో ఓటింగ్ జరిగితే ఏం జరుగుతుందన్నది చంద్రబాబులో టెన్షన్ పెంచేస్తోంది.