ఇటు ఆంధ్రప్రదేశ్ అటు దేశంలోని రాజకీయాలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా విశ్లేషించారు. కొత్త నాయకులను, ఓ సరికొత్త రాజకీయ వ్యవస్థను తయారు చేయాలన్నదే తన జీవితాశయమని ప్రకటించారు. సమాజానికి బలంగా నిలబడగలిగే నాయకత్వాన్ని తీసుకువచ్చినప్పుడే మార్పు సాధ్యమవుతుందని, అప్పుడే రెండు, మూడు తరాలు బాగుపడతాయని పవన్ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల చేతిలో దాడికి గురైన జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
గోదావరి జిల్లాల్లో సీమ తరహా రాజకీయ ఉండదనీ, పెద్దరికం మాత్రమే ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలిపారు. గోదావరి జిల్లాల్లో మాటలతో అయ్యే రాజకీయాలను వైసీపీ నాయకులు కత్తులు, కటార్ల వరకు తీసుకువచ్చారని ఆరోపించారు. ఫ్యాక్షన్ సంస్కృతిని బలంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ``రాయలసీమలో ప్రతి ముద్దకీ పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉండవు. గోదావరి జిల్లాలకు కూడా అలాంటి సంస్కృతిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసుల పాత్ర ఏమీ ఉండదు. వాళ్లు దౌర్జన్యానికి పాల్పడి పోలీసుల మీద ఒత్తిడి తేస్తే వారు మాత్రం ఏం చేయగలరు? పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు అంటే అది వారి వ్యక్తిగతం కాదు. ఒత్తిడికి లోబడి పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ తరహా క్రిమినల్ రాజకీయాలను పారద్రోలాలన్నదే నా లక్ష్యం.`` అని ప్రకటించారు.
వైసీపీ నాయకులు మనల్ని తిడుతున్నారు అంటే మనం చాలా బలమైన స్థాయిలో ఉన్నామని అర్థం అంటూ పవన్ చెప్పుకొచ్చారు. ``వాళ్లకి మన సమూహం అంటే భయం. అంతటి బలమైన సమూహం మనకి ఉంది. వీళ్లు వస్తే అంతా మార్చేస్తారన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మన పార్టీ నాయకులు కూడా మాట మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో మనమంతా ఐక్యంగా లేకపోతే ప్రత్యర్ధులదే గెలుపు అవుతుంది. దాడులు జరిగినప్పుడు భయపడకూడదు. ఒక భావజాలంతో ఇంకో భావజాలాన్ని కొట్టాలి. భావజాలంతో సమస్యను అధిగమించినప్పుడే హింస తగ్గుతుంది. అనేక క్రిమినల్ కేసులు ఉన్న వారే అంత మొండిగా వ్యవహరిస్తుంటే మనం ఇంకెంత మొండిగా ఉండాలి.`` అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రస్థానం గురించి పవన్ వివరించారు. ``ఇద్దరు ఎంపీలతో బీజేపీ పయనం ప్రారంభమయ్యింది. ఎమర్జెన్సీ సమయంలో అసలు పార్టీనే లేకుండా చేద్దాం అనుకున్నారు. పోరాటంతో ఈనాడు ఇంత బలంగా నిలబడింది. రాజకీయాలకు సరికొత్త రూపం ఇవ్వాలి. అంతా మాట్లాడుకునేదే అయినా ఓ సరికొత్త భావజాలాన్ని రాజకీయాలకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో పార్టీ స్థాపించాను.`` అని పవన్ వెల్లడించారు.