మూడు రాజధానుల ప్రతిపాదనపై సోమవారం రాత్రి అసెంబ్లీలో చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలు విన్నవారికి ఇదే అనుమానం మొదలైంది. మాట్లాడేటపుడు చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ చూసిన వారికి యూ టర్న్ తీసుకోవటమే మిగిలుందని అర్ధమైపోయుంటుంది. డిసెంబర్ 17వ తేదీన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. అప్పటి నుండి రాష్ట్రంలో జరిగిన గొడవను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
రాజధానిగా అమరావతిని తరలించేందుకు వీల్లేదంటూ చంద్రబాబు ఎంత రచ్చ చేశారో అందరూ చూసిందే. రాజధాని గ్రామాల్లోని రైతులను బాగా రెచ్చగొట్టారు. ఇక్కడ గ్రామాల్లో మాత్రమే కాకుండా ఉద్యమ విరాళమంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జోలె పట్టి జగన్ ను బాగా తిట్టారు. తాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే విషయాన్ని కూడా చంద్రబాబు మరచిపోయి జగన్ ను నోటికొచ్చినట్లు చాలా అసహ్యంగా మాట్లాడారు.
ఒకవైపు రాజధాని గ్రామాల్లో తిరుగుతూ మరోవైపు రాష్ట్రంలో పర్యటిస్తు జనాలను చంద్రబాబు రెచ్చ గొడుతున్న సమయంలోనే అసెంబ్లీ సమావేశాల తేదీని ప్రకటించారు. ఇంకేముంది అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ను చంద్రబాబు చెడుగుడు ఆడేయటం ఖాయమని జనాలంతా అనుకున్నారు. సమావేశాలు మొదలయ్యే తేదీ కోసం చాలా ఉత్కంఠంగా ఎదురు చూశారు.
అందరూ ఎదురు చూస్తున్నట్లే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. సభలో అనేక అంశాలపై చంద్రబాబును మంత్రులు, ఎంఎల్ఏలు చాకిరేవు పెట్టి ఉతికిన ఉతుకు ఉతక్కుండా ఉతికేశారు. వాళ్ళ ఉతుకుడికి చంద్రబాబుతో పాటు టిడిపి నేతలకు 70 ఎంఎం సినిమా కనబడింది. చివరకు అందరూ ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. చంద్రబాబు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత చూస్తే ఏముంది ? ఏమీ లేదు.
జగన్ కు వ్యతిరేకంగా బయట మాట్లాడిన ఫోర్సులో కనీసం పదోవంతు కూడా చంద్రబాబు స్పీచులో లేదు. పైగా ’రాజధానిగా అమరావతిని తరలించద్దని రెండు చేతులెత్తి వేడుకుంటున్నాను’ అని దణ్ణం పెట్టిన సీనే సభలో హైలైట్ గా నిలిచింది. ఎప్పుడైతే జగన్ కు దణ్ణం పెట్టేశాడో ఇక చంద్రబాబు యూటర్న్ తీసుకోవటమే మిగిలిందని ఎవరికి వారు అనుకుంటే అది వాళ్ళ తప్పు కానేకాదు.