తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 80 నియోజకవర్గాల్లో 120 మున్సిపాలిటీలో.. 9 కార్పొరేషన్లలో నేడు పోలింగ్ జరుగుతుంది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ప్రచార ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఇక టిఆర్ఎస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఇప్పటికే అన్ని ఎన్నికల్లో సత్తా చాటిన టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీ విజయాన్ని నమోదు చేయాలని దృడ సంకల్పంతో ఉంది. అయితే టిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ.. సీఎం సొంత ఇలాకా లోనే ఇబ్బందులు ఎదురయ్యాయి.
అదేంటి సీఎం సొంత నియోజకవర్గంలో ఇబ్బందులా అంటారా.. అవును ఆ ఇబ్బందులు ప్రతిపక్ష పార్టీలతో కాదు సొంత పార్టీ వారితోనే. మామూలుగానే అధికార టీఆర్ఎస్ పార్టీ అంటే ఆశావహులు ఎంతోమంది ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక సీఎం ఇలాకాలో అయితే ఈ ఆశావహుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో రాష్ట్రంలోని మరెక్కడా లేనివిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. దీంతో అధికార పార్టీకి పరిస్థితి ఇబ్బందిగా మారిపోయింది. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు... అదే పార్టీ నుండి టికెట్ లభించగా రెబల్స్ గా పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్టు గా పోటీ నడుస్తోంది.
రెబెల్స్ బెడద ఎక్కువగా ఉండడంతో గులాబీ పార్టీకి చెందిన క్యాడర్ కూడా రెండుగా చీలిపోయింది. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో అందరి చూపు సీఎం ఇలాకపైనే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఇలాకాలో టిఆర్ఎస్ పార్టీ విజయానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సీఎం ఇలాకాలో మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో అని అధికార పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏకంగా గజ్వేల్ నియోజకవర్గం మున్సిపాలిటీ 16 వార్డులకు 13 వార్డుల్లో టిఆర్ఎస్ పార్టీకి చెందినవారే రెబల్స్ గా పోటీ చేస్తున్నారు. దీంతో టిఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కించుకున్న వారికి టిఆర్ఎస్ పార్టీ నుంచి రెబల్స్ గా పోటీ చేస్తున్న వారికి మధ్య పోటీ నెలకొంది. మరో మున్సిపాలిటీలో కూడా పది వార్డుల్లో టిఆర్ఎస్ కు చెందిన వారే రెబల్స్ గా పోటీ చేస్తున్నారు. దీంతో సీఎం ఇలాక లోనే అసలు విషయం వర్తిస్తుందా లేదా ఎక్కడైనా తేడా కొడుతోందా అనే భయాందోళనలో ఉంది అధికారపక్షం. దీంతోసర్వత్రా ఉత్కంఠ నెలకొంది.