తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీ పోతుల సునీత అధినేత చంద్రబాబునాయుడుకు షాక్ ఇవ్వనున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.  మధ్యాహ్నం 3 గంటల తర్వాత సునీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరబోతున్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన వేదిక కూడా ఏర్పాటైపోయిందట లేండి.

 

ఇంతకీ విషయం ఏమిటంటే  మూడు రాజధాను ప్రతిపాదనకు చట్టం రూపం ఇచ్చేందుకు ప్రభుత్వం మూడు రోజుల పాటు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే సోమవారం  అసెంబ్లీలో  పరిపాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను  అసెంబ్లీ ఆమోదించింది.

 

అసెంబ్లీ నుండి రెండు బిల్లులు ఆమోదం కోసం శాసనమండలికి చేరుకుంది. ఎలాగైనా తనకున్న మెజారిటితో  బిల్లులను ఓడించాలని చంద్రబాబునాయుడు విప్ జారీ చేశారు. విప్ ప్రకారం సభ్యులంతా సభకు హాజరు కావాలని, విధిగా టిడిపి నిర్ణయం ప్రకారం వ్యతిరేకంగా ఓటు వేయాల్సుంటుంది.  ఇక్కడే సమస్య మొదలైంది. బిల్లులు మండలికి వచ్చాయి. అయితే బిల్లులకు బదులు రూల్ 71 పై చర్చకు టిడిపి పట్టుబట్టింది. మెజారిటి ఉంది కాబట్టి ఓటింగ్ జరిగింది.

 

విచిత్రమేమిటంటే ఓటింగ్ లో  టిడిపి నెగ్గినా సంఖ్యాబలం ప్రకారం రావాల్సిన అన్నీ ఓట్లు రాలేదు. మండలిలో టిడిపికి 26 ఓట్లుంటే వచ్చింది 24 మాత్రమే. లెక్కబెడితే పోతుల సునీత, సిద్ధార్ధరెడ్డి ఓట్లు వేయలేదని నిర్ధారించుకున్నది టిడిపి. అందుకనే వీళ్ళిద్దరిపై అనర్హత వేటు వేయాలని డిసైడ్ చేశారు. అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ ఇవ్వాలని నిర్ణయం జరిగింది.

 

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఒకటి రెండు రోజుల్లో వీళ్ళిద్దరిపై వేటు పడటం ఖాయమనే అనిపిస్తోంది. దాంతో ఎలాగూ టిడిపిలో ఉండలేని పరిస్ధితులు వచ్చాయి కాబట్టి వైసిపిలో చేరాలని సునీత డిసైడ్ అయినట్లు సమాచారం.  ముందుగా జగన్ తో మాట్లాడుకున్న తర్వాతే సునీత టిడిపికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు అర్ధమవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: