పౌరసత్వ సవరణ చట్టం అమలు విషయమై సుప్రీం కోర్టులో కేంద్రానికి ఊరట లభించింది. ఈ చట్టంపై ఎలాంటి స్టే ఇవ్వబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన కొత్త పిటిషన్లపై స్పందన తెలియజేయడానికి కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. అప్పటిదాకా సీఏఏపై హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టొద్దని, ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశించింది. 

 

సీఏఏను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అంశంపై ఈ ధర్మాసనం ఐదు వారాల తర్వాత విచారణ జరుపుతుందని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 143 పిటిషన్లు దాఖలయ్యాయి. చట్టం రాజ్యాంగ చెల్లుబాటుతో పాటు సీఏఏ అమలుపై స్టే విధించాలని కోరుతూ పలువురు సుప్రీంను ఆశ్రయించారు. చట్టానికి అనుకూలంగా కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపైనా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మరోవైపు అసోం, త్రిపురకు సంబంధించిన పిటిషన్లను వేరుగా విచారిస్తామని చెప్పారు. 

 

ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తన వాదనలు వినిపించారు. సీఏఏపై దాఖలైన మొత్తం పిటిషన్లలో తమకు 60 పిటిషన్ల కాపీలు మాత్రమే అందాయని, మిగతా పిటిషన్లపై స్పందన తెలియజేసేందుకు తమకు మరింత గడువు కావాలని అటార్నీ జనరల్‌ కోరారు. ఇదే సమయంలో సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ.. సీఏఏ అన్ని ప్రక్రియలను నిలిపివేయాలని అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రం స్పందన లేకుండా సీఏఏపై ఎలాంటి స్టే విధించలేమని స్పష్టం చేసింది. కొత్త పిటిషన్లపై నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

 

సీఏఏ పిటిషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేదాకా హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టరాదని, ఉత్తర్వులు జారీ చేయరాదని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులపై కూడా నాలుగు వారాల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: