’రాజధాని తరలింపును అడ్డుకుంటా’..
’ఢిల్లీ వెళుతున్నా, జగన్ సంగతేంటో తేల్చేస్తా’ ..
ఇది ఢిల్లీకి వెళ్ళేముందు జనసేన అధినేత, బిజెపి మిత్రపక్షం నేత చేసిన భీష్మ ప్రతిజ్ఞలు. మరి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలీదు కానీ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తాను ఢిల్లీకి వెళ్ళటమే జగన్ కతేంటో తేల్చేద్దామన్నట్లుగా, రాజధానిని అమరావతి నుండి తరలింపును అడ్డుకుంటానంటూ చెప్పిన పవన్ ఒక్కసారిగా మాట మార్చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అద్భుతాలు ఏదో జరుగుతుందని ఆశించవద్దంటూ చెప్పేశారు.
మరి ఢిల్లీకి బయలుదేరేముందుకు ఢిల్లీకి చేరుకునేందుకు మధ్య కాలంలో ఏమి జరిగింది ? ఏమి జరిగిందో ఎవరికీ తెలీదు పవనే చెప్పాలి. రాజధాని తరలింపు, మూడు రాజధానుల ప్రతిపాదనపై కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని ఒకవైపు బిజెపి అధికార ప్రతినిధి, బిజెపి రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు చెబుతున్న విషయం తెలిసిందే.
కొత్త బిచ్చగాడు లాగ పవన్ మాత్రం కేంద్రం ఒప్పుకోదంటూ చెప్పిందే చెబుతున్నాడు. ఇదే విషయాన్ని జీవిఎల్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని తరలింపు విషయంలో కేంద్రం ఎట్టి పరిస్ధితిల్లోను జోక్యం చేసుకోదని తాము పవన్ కు కూడా స్పష్టంగా చెప్పినట్లు ప్రకటించారు. రాజధాని తరలింపును తాను అడ్డుకుంటానని పవన్ చెబుతున్న విషయాన్ని ప్రస్తావిస్తే ఆ ప్రకటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని జీవిఎల్ తేల్చేశారు.
సో జరుగుతున్న విషయాలను బట్టి అర్ధమవుతున్నదేమంటే రాజధాని తరలిపు విషయంలో పవన్ వాదనను కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదని. ఒకవైపు రాజధాని తరలింపులో కేంద్రం జోక్యం ఉండదని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ తో భేటి తర్వాత పవన్ అంగీకరించారు. అంటే పవన్ ఇప్పటికైనా రాజధాని విషయంతో డ్రామాలు కట్టిపెట్టి, జనాలను భ్రమల్లో ముంచటం మానేసి వాస్తవాలను జనాల ముందుంచితే చాలా మంచిది. మొత్తానికి జగన్ ఏదో సాధిద్దామని చంద్రబాబును వదిలేసి బిజెపిలోకి వెళ్ళిన పవన్ కు కమలం పార్టీ దెబ్బంటే తెలిసివచ్చినట్లుంది.