ఆంధ్రుల రాజధానిగా అమరావతిని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే కృష్ణ, గుంటూరు మధ్యలో ఉన్నటువంటి 29 గ్రామాల పరిధిలో అమరావతిని ఏర్పాటు చేశారు. రైతుల దగ్గరి నుంచి 33 వేల ఎకరాల భూమిని సేకరించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమిని ప్రభుత్వం డెవలప్ చేసి రాజధానిని నిర్మించి దానితో పాటుగా 200 గజాల కమర్షియల్ స్థలాన్ని రైతులకు అప్పగిస్తుంది. ఈలోగా అక్కడ అమరావతి నిర్మాణాలు జరగాలి.
అమరావతిలో కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే, రాజధాని ఒకేచోట ఉంటె భవిష్యత్తులో హైదరాబాద్ లాగానే ఇబ్బందులు వస్తాయని వైకాపా భావిస్తోంది. అందుకోసమే అమరావతి మాత్రమే కాకుండా దానికి తోడు మరో రెండు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. అయితే, శాసనసభలో గందరగోళం మధ్యన పాస్ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ తన చతురతతో, ఎత్తులతో బిల్లును మండలిలో అడ్డుకుంది. గతంలో ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇలానే ప్రవర్తించింది.
ఇక ఇదిలా ఉంటె, అసలు వైకాపా ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్తున్న విషయాలు ఏమంటే, అన్ని కూడా ఒకేచోట ఏర్పాటు చేస్తే... ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో మరలా ప్రాంతీయ ఉద్యమాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్రా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రజలు అభివృద్ధి విషయంలో ఉద్యమాలు చేసి మూడు ప్రాంతాలుగా విడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకోసమే ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మూడు రాజధానుల వలన మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే, తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో మోకాలడ్డేయడంతో బిల్లు పెండింగ్ పడింది. సెలక్ట్ కమిటీకి పంపించింది. దీనిపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఆంధ్రప్రాంతం తప్పించి మిగతా చోట్ల జగన్ బలంగానే ఉన్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లే దాన్ని బట్టి ఈ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.