జగన్మోహన్ రెడ్డి సర్కార్ తలపెట్టిన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును శాసనమండలిలో చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో చర్చ జరుగుతున్న సమయంలో తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఏకంగా శాసనమండలి చైర్మన్ పోడియం ముందే వైసీపీ మంత్రులు టీడీపీ ఎమ్మెల్సీలు తోపులాట జరిగింది. టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీ మంత్రులు ఒకరినొకరు తోసుకుంటూ శాసనమండలిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా రసాభాస మధ్య వికేంద్రీకరణ పై చర్చ ముగిసింది.
అయితే చర్చ ముగిసిన అనంతరం టిడిపి ఎమ్మెల్సీలు వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారని డిమాండ్ చేయడం శాసనమండలి చైర్మన్ షరీఫ్ కూడా సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు పంపించాలని నిర్ణయించడంతో ఒక్కసారిగా వైసీపీ మంత్రులు అందరూ రెచ్చిపోయారు. అయితే దీనిపై నేడు మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలిలో ప్రవర్తించారని ఆరోపించారు. ఏకంగా శాసనమండలి ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి దుర్భాషలడటం చేశారు అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు.
వైసీపీ నేతల తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వైసిపి సభ్యులు మంత్రి హోదాలో ఉండి కూడా.. ఎంతో నీచంగా ప్రవర్తించారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో వైసీపీ మంత్రులు అందరూ వ్యవహరించిన తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా చూస్తామంటూ తెలిపారు. కాగా శాసనమండలిలో విజయం టిడిపి విజయం మాత్రమే కాదని ఎంతో మంది రైతుల విజయం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే అటు వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని శాసనమండలి చైర్మన్ నిర్ణయించడంతో.. వికేంద్రీకరణ అమలు కావడానికి ఆంధ్రప్రదేశ్లో భారీగానే సమయం పట్టేటట్లు కనిపిస్తోంది. మరి దీనిపై జగన్ సర్కార్ ఎలా ముందడుగు వేస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.