అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టుగా ఇప్పటికే ఆధారాలు బయటపడ్డాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోకానికి తెలియజేసింది. డాక్యుమెంట్ రూపంలో కూడా బయటపెట్టింది. ఎవరెవరు ఎవరి పేరు మీద ఎంతెంత భూములు కొనుగోలు చేశారు. ఎలా కొన్నారు. కొనుగోలు చేసిన వ్యక్తులకు నిజంగానే అంతటి ఆర్ధిక స్థోమత ఉన్నదా లేదా అనే విషయాలను కూడా ఆరాతీస్తున్నారు. దీనికి సంబంధించిన చాలా విషయాలు ప్రభుత్వం బయటపెట్టింది.
ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్తున్న వాదనల్లో సరిలేదని, ఆ వాదన సరికాదని టీడీపీ వాదిస్తోంది. దమ్ముంటే నిరూపించి చర్యలు తీసుకోమని సవాల్ విసురుతున్నది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే, దానిని బయటపెట్టి, తద్వారా తమపై చర్యలు తీసుకోవాలని, అంతేగాని, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధానిని తరలించే చర్యలు తీసుకోవద్దని టీడీపీ వాదిస్తోంది. అసెంబ్లీలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై చర్యలు తీసుకునేందుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై సీఐడీ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.
ల్యాండ్ పూలింగ్పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నది. అలానే, 796 తెల్లరేషన్కార్డు హోల్డర్స్పై కేసు నమోదు చేసింది. రూ.3 కోట్లకు చొప్పున ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్లరేషన్కార్డు హోల్డర్స్ ను గుర్తించింది. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు సిఐడి గుర్తించింది. తెల్లరేషన్ కార్డు హోల్డర్స్తో కొనుగోలు చేయించిన వారి వివరాలను ఆరా తీస్తోంది. వారిని విచారించేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ 131 మంది 129 ఎకరాలు కొన్నట్టుగా తెలుస్తోంది. పెద్దకాకానిలో 43 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ 40 ఎకరాలు కొన్నట్టుగా తెలుస్తోంది.
అలానే, తాడికొండలో 188 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ 180 ఎకరాలు కొన్నారు. తుళ్లూరులో 238 మంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ 243 ఎకరాలు కొనుగోలు చేశారు. మంగళగిరిలో 148 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ 133 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇక తాడేపల్లిలో 49 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ 24 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా లెక్కలు తేలాయి. దీనిపై సిఐడి ఆరా తీస్తున్నది. త్వరలోనే వీటిని సంబంధించిన ఆధారాలతో కేసులు ఫైల్ చేసి, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయనున్నారు. అయితే, ఎప్పటిలోపుగా ఇది జరగొచ్చు అన్నది తెలియాల్సి ఉన్నది.