కరోనా వైరస్ పంజా విసురుతోంది. చైనా సహా పలు ఆసియా దేశాల్ని హడలెత్తిస్తోంది. ఇప్పటికే స్వైన్ ఫ్లూ భయపెడుతుంటే... ఈ కొత్త వైరస్ కరోనా చాలా దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది.
కరోనా... చైనాతో పాటు మరికొన్ని దేశాల్ని భయపెడుతున్న వైరస్ ఇది. దీనివల్ల చైనాలో తొమ్మిది మంది చనిపోగా... 440 కేసులు నమోదయ్యాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్... శ్వాసనాళాల్లో ప్రవేశించి... చివరకు ప్రాణాలనే తీస్తుంది. ఈ వారంలోనే చైనా కొత్త ఏడాది వేడుకలు జరగనుండగా లక్షలాది మంది ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు.
వైరస్ మరింత వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున దీనిని నివారించే చర్యలకు పలు దేశాలు శ్రీకారం చుట్టాయి. వుహాన్ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, రహదారులపై టెంపరేచర్ చెక్ చేయడంతో పాటు... స్థానికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. కరోనా వైరస్.. ప్రమాదకరమైన సార్స్ వైరస్ను పోలి ఉండటంతో కలకలం రేగుతోంది. 2003లో విజృంభించిన సార్స్ వైరస్ కారణంగా చైనా, హాంగ్కాంగ్లో 650 మంది చనిపోయారు. అయితే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఇప్పటికే థాయ్ లాండ్, జపాన్, దక్షిణ కొరియాలకు ఈ వైరస్ పాకింది. మరోవైపు చైనా పర్యటనకు వెళ్లిన భారతీయుల్ని కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇటు ఈ వైరస్ను గుర్తించడం కష్టమైన పని అంటున్నారు వైద్యులు.
ఈ తరహా వైరస్లు మొత్తం ఏడింటిని ఇప్పటివరకు గుర్తించారు. గతంలో సార్స్, మెర్స్ వైరస్లు కూడా చైనాలో విజృంభించి వందల సంఖ్యలో ప్రాణాలు తీశాయి. ముందు జలుబు, తర్వాత జ్వరం, దగ్గు, ఛాతి నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు... చివరకు న్యుమోనియా వరకు వెళ్లి ప్రాణాలు తీస్తుంది. చలికాలంలో ఇది ఎక్కువగా విజృంభిస్తుంది.
ఇటు బీజింగ్, షాంఘై, దక్షిణ గాంగ్డాంగ్ ప్రావిన్స్లోనూ 20 మందికి పైగా ఈ వైరస్ బారినపడ్డారు. అంతేగాక, దక్షిణకొరియా, జపాన్, థాయ్లాండ్లోనూ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఉహాన్ నుంచి తమ దేశానికి వస్తున్న పర్యాటకులకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణకొరియా దేశాలు ఎయిర్పోర్టుల్లోనే హెల్త్ చెకప్లు చేస్తున్నాయి. భారత్ కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. చైనా నుంచి వచ్చే ప్రయాణీకుల కోసం ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసింది.