``ఈ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నేను నిద్రపోను. నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది.. ఢిల్లీకి వెళ్తున్న... నేను మీకు చెప్పడం లేదు.. కానీ, అద్భుతాలు జరగబోతున్నాయి`` ఇది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే ముందు చేసిన కామెంట్లు. అయితే, పవన్ ఢిల్లీ వెళ్లనూ వెళ్లారు. అక్కడ ఎప్పట్లాగే మీడియాతోనూ మాట్లాడారు. ఇంతకీ ఏమన్నారంటే...రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నారు. రాజధానిని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే ఈ మాటలు మాట్లాడారు పవన్. ``రాజధాని గురించి ఢిల్లీలో బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. అందుకే తెలివిలోకి వచ్చి ఇలా మాట్లాడారా?`` అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి, అనంతరం ఇవాళ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్తో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ వేదికగా చెప్తున్నాను. రాజధానిపై నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే అనే క్లారిటీ ఇచ్చారు.ఢిల్లీ వెళ్లేముందు గంభీర ప్రకటనలు చేసిన జనసేనాని అంతే వేగంగా ఈ మాట మాట్లాడేశారాంటే...లోపల బీజేపీ వాళ్లు తలుపులేసి మరీ తలంటారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
పైగా, రాజధాని మార్పుతో కేంద్రానికి సంబంధం లేదని, రాష్ట్రాలు చూసుకునే నిర్ణయం అంటూనే అంటూనే అమరావతి కోసం పోరాడతామని అక్కడ వాళ్లకు అన్యాయం జరుగుతుందని చెప్పడం ద్వారా ప్రభుత్వంపై తన గుడ్డి వ్యతిరేకత గలం వినిపిస్తున్నారా? అంటూ ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని వెళ్లే ముందు ఒకమాట, వెళ్లి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్న పవన్ యూ-టర్నుల్లో యజమానిని మించిపోయాడు అంటూ ఇంకొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా జనసేనాని తన అపరిపక్వ కామెంట్లను బీజేపీ పెద్దలకు ఆదిలోనే రుచి చూపించారని పేర్కొంటున్నారు.