రెండు బిల్లులపై శాసనమండలిలో జరిగిన గొడవ చూస్తుంటే తెలుగుదేశంపార్టీ భయపడిందా ? మండలిలో జరిగిన పరిణామాలు చూస్తుంటే ఇదే సందేహం వస్తోంది. అధికార వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి చట్టం-2020, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై ఓటింగ్ జరగకుండా టిడిపి అడ్డుకోవాల్సిన అవసరం లేదు. శాసనమండలిలో మెజారిటి ఉండి కూడా ఓటింగ్ కాకుండా సెలక్ట్ కమిటికి బిల్లులను పంపాలన్న నిర్ణయం ఎందుకు తీసుకుంది ?
58 స్ధానాలున్న శాసనమండలిలో టిడిపికి 26 మంది సభ్యులున్నారు. వైసిపికి తొమ్మిది మందున్నారు. బిజెపికి ముగ్గురు, స్వతంత్రులు ముగ్గురు, పిడిఎఫ్ కు ఐదుగురు సభ్యులున్నారు. 8 మంది నామినేటెడ్ సభ్యులుంటే మరో నాలుగు స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. అసెంబ్లీలో పాస్ చేయించుకోగలిగిన ప్రతి బిల్లు మండలిలో పాసవ్వాలంటే కచ్చితంగా టిడిపి సహకారం కావాల్సిందే. లేకపోతే ప్రతి బిల్లు వీగిపోవటం ఖాయం.
తాజాజా రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. మరి మండలిలో వాటిపై చర్చ ఎందుకు జరగలేదు ? ఓటింగ్ కు ఎందుకు టిడిపి అంగీకరించలేదు ? ఇపుడిదే ప్రశ్నలు అందరినీ కుదిపేస్తున్నాయి. టిడిపి వర్గాల సమాచారం ఏమిటంటే ఓటింగ్ అంటూ జరిగితే మొత్తం 26 ఓట్లూ టిడిపికే పడతాయనే నమ్మకం చంద్రబాబునాయుడులో లేదట. ఎందుకంటే బిల్లులు పాస్ చేయించుకోవటం జగన్ కు చాలా ప్రతిష్టాకరం.
అందుకనే తమ ఎంఎల్సీలతో మాట్లాడి సర్దుబాటు చేసుకునే అవకాశాలున్నాయనే అనుమానాలు చంద్రబాబులో పెరిగిపోయాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయటం రత్నాబాయి శమంతకమణ అసలు సభకే గైర్హాజరవ్వటంతో చంద్రబాబు అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి. దానికి తోడు ముందు రూల్ 71పై చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ లో ఇద్దరు టిడిపి సభ్యులు పోతుల సునీత, సిద్దార్ధరెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఓట్లేశారు.
ఇటువంటి సంఘటనలను చూసిన తర్వాత రెండు బిల్లులను ఆమోదించే విషయంలో ఓటింగ్ జరిగితే టిడిపి సభ్యులే పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసే ప్రమాదం ఉందనే అనుమానం బలపడిపోయిందట. అందుకనే అసలు ఓటింగ్ ఊసే ఎత్తకుండా ఛైర్మన్ ను మ్యానేజ్ చేసుకుని రెండు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపేట్లు చక్రం తిప్పారు. అంటే తమ సభ్యుల విషయంలోనే చంద్రబాబు ఎంతగా భయపడ్డారో అర్ధమైపోయింది.