ఏ మాటకు ఆ మాట వైసీపీ కోసం రోజా చాలానే చేసింది. జగన్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తిరిగి ఆయన సీఎం అయ్యే వరకు ఆయన కష్టసుఖాల్లో రోజా వెన్నంటే ఉన్నారు. చంద్రబాబు రెండు సార్లు ఆమె ఓడిపోయే చోట్లే సీటు ఇచ్చారు. పార్టీపై వ్యతిరేకత ఉన్న 2004లో ఓ సారి నగరిలో సీటు ఇవ్వగా ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత నగరి సీటును తన సామాజిక వర్గానికి చెందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడికి ఇచ్చి రోజాను ఆమె ఓడిపోతుందని తెలిసే బలవంతంగా గల్లా అరుణపై చంద్రగిరిలో పోటీ చేయించారు. అలా రెండు ఎన్నికల్లోనూ ఆమె ఓడిపోయింది.
ఆ తర్వాత 2014లో ఆమె గెలిచినా పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత ఆమెది ఐరెన్ లెగ్ అంటూ చాలా మంది ఆమెపై వ్యతిరేక ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేశారు. వాటిని అన్నింటిని ఆమె పటా పంచలు చేసి 2019లో విజయం సాధించారు. ఈ సారి పార్టీ అధికారంలోకి రావడం జగన్ సీఎం అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి వరకు ఆమె మంత్రివర్గం లిస్ట్లో ఉందని టాక్ వచ్చింది.
అయితే చిత్తూరు జిల్లాకే చెందిన ఓ ముఖ్యనేత అభ్యంతరంతో ఆమెకు మంత్రి పదవి దక్కలేదని సమాచారం. రోజాకు ఉండే బలమైన వాయిస్ నేపథ్యంలోనే ఆ ముఖ్య నేత జగన్ దగ్గర లాబీయింగ్ చేసి ఆమెకు మంత్రి పదవి దక్కకుండా చేశారన్న ఆపవాదు ఉంది. అయితే ఇందుకు రోజా వ్యవహార శైలీ కూడా కారణమనే వారు లేకపోలేదు. జగన్కు దగ్గరగా ఉంటే చాలు, ఇక మిగిలిన వారితో పనేంటి అనే ధోరణిలో ఉంటూ, ఇతర వైసీపీ పెద్దలతో గౌరవంగా ఉండదన్న ప్రచారం ఉంది.
రోజా ఈ తీరు నచ్చకే చాలా మంది వైసీపీ నేతలు ఆమెను పరోక్షంగా టార్గెట్ చేస్తుంటారన్న ప్రచారం జరిగింది. అంతేకాకుండా వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పనిచేసే రామోజీ సంస్థ ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమానికి రోజా జడ్జిగా వ్యవహరించడం కూడా ఆమెకు అధిష్టానం వద్ద మైనస్ మార్కులు పడుతున్నాయి. మరి ప్రస్తుతం ఆమె ఏపీఐఐసీ చైర్మన్గా ఉన్నా రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి దక్కించుకుంటారో ? లేదో ? చూడాలి.