ఉద్యమాలు నడిపించే వారు అనుభవజ్ఞులు, సరైన పరిజ్ఞానం ఉన్నవారు కాకపోతే...ఆ పోరాటం హింసాత్మక రూపం దాల్చుతుంది. ఎందరో సామాన్యుల ప్రాణాలు బలిగొంటుంది. ఆ దారున ఘటనలకు బలైన వారి కుటుంబంలో ఎంతో విషాదం కలుగుతుంది. తాజాగా జార్ఖండ్లో ఇదే తరహా ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో పతల్గర్హి ఉద్యమం తీవ్రతరమయ్యింది. అయితే, తమ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నారన్న కక్షతో పశ్చిమ సింఘ్బం జిల్లాలోని ఏడుగురు రైతులను సాయుధులైన ఉద్యమకారులు అపహరించి అనంతరం హత్య చేశారని పోలీసులు తెలిపారు.
గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కలిగించాలని, గిరిజనుల అధీనంలో ఉన్న భూములపై ప్రభుత్వ అజమాయిషీ ఉండరాదని, అడవులు, నదులపై ప్రభుత్వ నిబంధనలు ఉండరాదని తదితర డిమాండ్లతో పతల్గర్హి ఉద్యమం కొనసాగుతోంది. పతల్గర్హి అనే పేరును గిరిజనుడు పెట్టాడు. అయితే, ఈ ఉద్యమంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యక్తం చేస్తున్న వారిలో కొందరిని హత్య చేశారు. బురుగులికేర గ్రామం నుంచి ఏడుగురు రైతులను ఉద్యమకారులు కిడ్నాప్ చేశారన్న సమాచారం రావడంతోనే పోలీసులు హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకున్నారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఆపరేషన్) సాకేత్ కుమార్ సింగ్ తెలిపారు. ఉద్యమకారులు హత్య చేసిన ఏడుగురు గ్రామస్థుల భౌతికకాయాలను గ్రామానికి నాలుగు కిలో మీటర్ల దూరంలోని అడవిలో వదిలి పారిపోయారని ఆయన చెప్పారు. సామూహికంగా హత్యకు గురైన వారిలో పంచాయతీరాజ్ ప్రతినిధి కూడా ఉన్నారని ఆయన తెలిపారు. ఉద్యమకారుల చేతుల్లో లాఠీలు, గొడ్డళ్ళు ఉన్నట్లు స్థానికులు తెలిపారని పోలీసులు చెప్పారు.
కాగా, ఏడుగురు గ్రామస్థులను హత్యమార్చిన ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ దిగ్భ్రాంతి చెందారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోలేరని అన్నారు. చట్టం అత్యున్నతమైందని ఆయన తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని, దోషులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి సొరెన్ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.