అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. ఎన్నికలు ముగిశాయి కదా హడావిడి ఏమైనా తగ్గుతుంది అనుకునేరు... ఎన్నికలు ముగిశాయి కదా... మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు విజయం కోసం తహతహలాడుతు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25న కౌంటింగ్ ఉండటంతో మరింత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఇక విజయం కోసం ఏకంగా బెట్టింగ్ లు కూడా మొదలైనట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల విజయాలు అపజయాలు పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారట . ఇకపోతే కార్పోరేషన్ లలో అతి తక్కువ మొత్తంలో ఓటింగ్ శాతం నమోదైన విషయం తెలిసిందే.
ముఖ్యంగా నగర శివార్లలోని కొన్ని కార్పొరేషన్ లలో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. నిజాంపేట, జవహర్ నగర్, కాచిగూడ బోడుప్పల్, మీర్పేట్, బడంగ్ పేట్ తదితర కార్పొరేషన్లలో ఓటర్లు ఎక్కువగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో గణనీయంగా ఓటింగ్ శాతం తగ్గిపోయింది. మున్సిపాలిటీ లతో పోలిస్తే కార్పొరేషన్లలో ఓటింగ్ గణనీయంగా తగ్గడంతో అభ్యర్థుల ఆందోళన చెందుతున్నారు. గణనీయంగా తగ్గిపోయిన ఓటింగ్ శాతం తమ తమ గెలుపు పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని దిగులు చెందుతున్నారు. ఇదిలా ఉంటే... మరోవైపు భారీ మొత్తంలో బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో చాలా మంది అభ్యర్థుల గెలుపోటములపై... పందాలు కడుతున్నారట. ఇక అన్ని మున్సిపాల్టీల్లో ప్రజలందరూ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేదానిపై చర్చించుకుంటున్నారు కూడా..
ముఖ్యంగా జల్ పల్లి మున్సిపాలిటీ లో ఇండిపెండెంట్ ల హవా మరీ ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు టిక్కెట్టు దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీచేసి పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇండిపెండెంట్గా విజయం సాధిస్తారా లేక పార్టీ నుంచి పోటీ చేసిన వారు విజయం సాధిస్తారా అనేది ప్రజల్లో నెలకొన్న ప్రశ్న . బడంగ్ పేట లోని మామిడిపల్లి మల్లాపూర్ బాలాపూర్ లో కూడా వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉండటంతో అభ్యర్థుల గెలుపుపై భారీగా పందాలు కాస్తున్నట్లు సమాచారం. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో... ఎవరు ఎంతవరకు ఓటర్లను ఆకట్టుకుని విజయం సాధించారో తెలియాలంటే రేపటి వరకు వేచిచూడాల్సిందే. రేపటితో ఉత్కంఠకు తెర పడనుంది.