తెలుగు నాట కొన్ని పత్రికల వ్యవహారశైలి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఎల్లో మీడియాగా పేరు బడిన ఆ పత్రికలు.. తమ అభిమాన నాయకుడి కోసం ఎలాంటి చిత్రమైన రాతలకైనా తెగబడిపోతున్నారు. అసలు అధికారానికి దూరంగా ఉన్న తమ నాయకుడిని మళ్లీ జననేతగా ఫోకస్ చేసుకునే ప్రయత్నాలకు తోడు.. తమ అత్యంత ప్రియమైన అమరావతి నుంచి రాజధాని వెళ్లిపోవడం జీర్ణించుకోలేక.. కొత్త కొత్త వ్యూహాలతో పత్రికలను తీర్చి దిద్దుతున్నారు.
తాజాగా శుక్రవారం నాటి ఓ ప్రధాన తెలుగు పత్రికలో మేం ప్రజల పక్షాన పనిచేస్తున్నాం.. అని రాసుకొచ్చారు. ఇదే నిజమైతే.. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమాలను మాత్రమే ఇంతింతై.. అన్నట్టుగా ప్రచురిస్తున్న ఈ పత్రిక.. మరోపక్క, మూడు రాజధానుల వార్తలను మచ్చుకైనా ఎందుకు ప్రచురించడం లేదు.. ఈ ఆందోళనలు చేస్తున్నవారు ప్రజలు కాదా? అన్న అనుమానం పాఠకుల్లో కలగక మానదు.
తమకు అనుకూలమైన ఘటనలు ఒకలా.. తమకు ఇష్టం లేని ఘటనలను మరోలా చిత్రీకరించే ప్రయత్నం ఎప్పటి నుంచో వస్తున్నదే. కానీ.. ఇప్పుడు అతి కొత్త పుంతలు తొక్కుతోంది. అమరావతి ప్రాంతంలో జరిగే నిరసనలు తప్పే ఇంకేమీ ప్రధాన వార్తలకు ఈ పత్రికలకు కనిపించడం లేదు. ఆ ప్రాంతంలో ఎవరు మాట్లాడినా.. లేదా.. అమరావతి వాదనకు అనుకూలంగా ఎవరు గళం విప్పినా వారికి అగ్రపీఠం వేస్తున్నాయి.
ఎవరెవరో భూజాలపై తుపాకీ పెట్టి జగన్ సర్కారును కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి ప్రాంతం ఆందోళనలను హైలెట్ చేస్తున్నఈ పత్రికలు.. మూడు రాజధానుల నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడినందుకు జిల్లాల్లో జరిగిన ఆందోళనలు ఏమాత్రం పట్టడం లేదు. మూడు రాజధానులు కావాలంటూ జరుగుతున్న ప్రదర్శనలను ఈ పత్రికలు అస్సలు పట్టించుకోవు. అంటే ఒకవైపే చూస్తామంటూ ఒక పార్టీకే కొమ్ముకాస్తామంటూ మరోసారి చెప్పకనే చెబుతున్నాయి.