తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పదేపదే మీడియా సమావేశాల్లో గాని ఇటు అసెంబ్లీ సమావేశాల్లో గాని ఎక్కడైనా ప్రసంగించినా గాని ఎక్కువగా మాట్లాడే మాట హుందాతనం. తనకు హుందాతనం ఉందని తన ప్రత్యర్ధులకు లేదని రాజకీయాలు హుందాగా చేయాలని మాట్లాడుతూ చంద్రబాబు తన ప్రత్యర్థులకు, ఇతర పార్టీల రాజకీయ నాయకులకు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు. అదే విధంగా తనను విమర్శించిన వారిని హుందాగా విమర్శిస్తున్నా అనే భ్రమలో ఉంటారు.
అయితే అధికారం నుంచి దిగిపోయిన తరువాత మాత్రం ఆ హుందాతనాన్ని చంద్రబాబు దాదాపుగా మర్చిపోయారనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా ఉన్మాది అంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా పులివెందుల పంచాయితీ అంటూ కూడా చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక ప్రాంతం గురించి అవమానించడం పక్కన పెడితే, ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఆ మాట అనడం సబబు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నాం అన్నది కాదు.. ఎంత హుందాగా ఉన్నాం అన్నదే ప్రధానం. ఈ విషయం బాబుకు తెలియదనీ కాదు.. ఈ వయస్సులో ఆయన ఎందుకు ఇంతలా ఫ్రస్టేషన్కు గురవుతున్నారో ? అర్థం కాని పరిస్థితి.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. విమర్శించటం సహజం కానీ పదేపదే ఉన్మాది అనడం జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం, దాని మీద అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తే... నేను ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అంటాను అంటూ వ్యాఖ్యలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి 40 ఏళ్ల అనుభవం ఇదేనా అనేది ఆలోచించుకోవాలి. చంద్రబాబు హుందాతనం గురించి డప్పు కొట్టే తెలుగు తమ్ముళ్ళు కూడా ఈ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఏవిధంగా సమర్ధిస్తారు అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.