తెలంగాణ మంత్రి కే తారకరామారావు దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు దావోస్ వెళ్లిన  ఆయ‌న తన పర్యటనలో భాగంగా అనేక ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన మంత్రులను  కలిశారు.తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో జరిగిన దావోస్ పర్యటన విజయవంతమైంది. 

 

గత నాలుగు రోజులుగా ఈ మేరకు దావోస్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్ సుమారు 50కి పైగా ముఖాముఖి సమావేశాలతో పాటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 5 చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత నాలుగు రోజులుగా మంత్రి  ఆల్ఫాబెట్ మరియు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోకకోలా సిఓఓ జేమ్స్ క్వేన్సీ , సేల్స్ ఫోర్స్ స్థాపకుడు చైర్మన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్కికి లాంటి కార్పొరేట్ దిగ్గజాల తో సమావేశం అయ్యారు.

 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతిశీల విధానాలతో పాటు పారిశ్రామిక పాలసీని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను, వివిధ పరిశ్రమలకు ఇక్కడ అందుబాటులో ఉన్న వనరులను పరిచయం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల లో అగ్రస్థానంలో నిలుస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం శీఘ్ర గతిన అభివృద్ధి చెందుతున్న తీరుని కూడా మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరం యెక్క కాస్మోపాలిటన్ కల్చర్ ని మరియు గత కొన్ని సంవత్సరాలుగా జీవించేందుకు అనువుగా ఉన్న నగరాల్లో అత్యుత్తమ నగరంగా ఎంపిక అవుతున్న విషయాన్ని కూడా వివరించారు. 

 


దావోస్ పర్యటన ద్వారా పిరమల్ గ్రూప్ కి సంబంధించిన ఐదు వందల కోట్ల పెట్టుబడితో పాటు అనేక ఇతర కంపెనీలు తెలంగాణ పట్ల ఆసక్తి  వ్యక్తం చేసేలా దావోస్ పర్యటన విజయవంతమైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా దావోస్లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పెవిలియన్ ని ఏర్పాటు చేసింది. భారతదేశం నుంచి మధ్యప్రదేశ్ కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు కూడా పాల్గొన్నప్పటికీ తెలంగాణ భారీ ఎత్తున సొంత రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాగలిగింది. కాగా, రాష్ట్రానికి వ‌చ్చిన కేటీఆర్‌..మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల ప‌ట్ల ఉత్కంఠ‌తో ఉన్న‌ట్లు ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: