తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు రానున్న రోజుల్లో కోర్టు ఇక్కట్లు తప్పవా ? అంటే అవినీతి నిరోధక శాఖ (ఏ సీ బీ ) కోర్టు ప్రదర్శిస్తున్న దూకుడు పరిశీలిస్తే , అవుననే సమాధానం విన్పిస్తోంది . చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై విచారణ చేపట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షడు , మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు సతీమణి , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి , ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే .
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు . చంద్రబాబు పై ఆమె మొదటి నుంచి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు . దానిలో భాగంగానే ఏసీబీ కోర్టును ఆశ్రయించగా , కోర్టు లక్ష్మీపార్వతి పిటిషన్ స్వీకరించింది . లక్ష్మీపార్వతి పిటిషన్ ను ఇప్పటికే విచారించిన ఏసీబీ కోర్టు , తాజాగా శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది . తదుపరి విచారణ ను వచ్చే నెల ఏడవ తేదీకి వాయిదా వేసింది . ఈ సందర్బంగా హైకోర్టు ... చంద్రబాబుకు ఇచ్చిన స్టే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించడం పరిశీలిస్తే , రానున్న రోజుల్లో చంద్రబాబు కు ఇక్కట్లు తప్పకపోవచ్చుననే వాదనలు విన్పిస్తున్నాయి .
గతంలోను చంద్రబాబు పై వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోపాటు , వైఎస్ విజయమ్మ లు కూడా కోర్టు లో కేసులు వేశారు . అయితే ఆ కేసులేవీ కోర్టులో నిలబడలేదు . వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు . మరి ఏసీబీ కోర్టు లో లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ పై చివరకు న్యాయస్థానం ఎటువంటి తీర్పు వెలువరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది .